Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే ఉరి వేసుకున్నాడా?

By:  Tupaki Desk   |   13 July 2020 6:50 AM GMT
ఆ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే ఉరి వేసుకున్నాడా?
X
దేశంలో మరెక్కడా లేని విధంగా నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా బిహార్.. ఉత్తరప్రదేశ్ లు నిలుస్తుంటాయి. తరచూ ఆ రాష్ట్రాల్లో చోటు చేసుకునే హింస ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంటుంది. అదే సమయంలో.. రాజకీయ హింస.. రాజకీయ ప్రతీకారాలు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే తీరుకు సంబంధించిన అంశాల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముందుంటుంది. తాజాగా బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనంగా మారింది.

పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్న ఈ ఉదంతం పశ్చిమబెంగాల్ లోని హెమ్తాబాద్ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సొంతూరుకు కేవలం కిలోమీటరు దూరంలో ఆయన డెడ్ బాడీ కనిపించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ ఉరి వేసుకొని చనిపోయారన్న వైనం ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

అయితే.. ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకోలేదని.. ఆయన్ను హత్య చేసి సూసైడ్ గా చిత్రీకరిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి కొందరు వచ్చిన ఎమ్మెల్యేను తమ టూవీలర్ మీద ఎక్కించుకు వెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెల్లారేసరికి బిందాల్ ఏరియాలో మూసివేసిన దుకాణం వరండాలో వేలాడుతున్న ఎమ్మెల్యే డెడ్ బాడీని చూసిన వారు షాక్ తిన్నారు.

సీపీఐ-ఎం పార్టీకి చెందిన దేబేంద్ర నాథ్ గత ఏడాది మేలో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆయనతో పాటు యాభై మంది కౌన్సెలర్లు కూడా బీజేపీ అగ్రనేతల సమక్షంలో చేరారు. మరికొద్ది నెలల్లో బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగానే కాదు.. రాజకీయంగా కలకలాన్ని రేపే అవకాశం ఉంది. ఈ ఉదంతం బీజేపీ వర్గాలకు నోట మాట రాకుండా చేశాయని చెబుతున్నారు.