Begin typing your search above and press return to search.

అతి త్వరలో శుభవార్త చెప్పబోతున్నాం : డోనాల్డ్ ట్రంప్

By:  Tupaki Desk   |   14 July 2020 9:15 AM GMT
అతి త్వరలో శుభవార్త చెప్పబోతున్నాం : డోనాల్డ్ ట్రంప్
X
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిపోతోంది. ప్రతి రోజూ కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రతి రోజు దాదాపుగా 60 వేల మంది పైగా ఈ కరోనా భారిన పడుతున్నారు. ఈ తరుణంలో అమెరికా అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, భారత్‌, బ్రెజిల్‌ వంటి పెద్ద దేశాల కంటే అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా పరీక్షా సామర్థ్య కార్యక్రమం ఉందని తెలిపారు. అలాగే , అమెరికాలో అత్యల్ప మరణాల రేటు మాత్రమే ఉందని వైట్‌ హౌజ్‌ లో జరిగిన సమావేశంలో చెప్పారు.

ఈ సమావేశంలో అధినేత ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే తమ పరిపాలన విభాగం భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వల్ల అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తాయని అన్నారు. ఇప్పటి వరకు 45 మిలియన్ల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించామని , అందుకే ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చాయి అని , కొన్ని దేశాల్లో కేవలం ఆస్పత్రికి వచ్చిన వారికి, అనారోగ్యంగా ఉన్న వారికే పరీక్షలు చేస్తున్నాయి. అందుకే అక్కడ ఎక్కువ కేసులు లేవు. అయితే మనకు కేసుల ప్రభావం ఎక్కువ ఉన్నందున కత్తి మీద సాములా తయారయ్యింది అని తెలిపాడు. ‘మేము కరోనాకు వ్యతిరేకంగా గొప్పగా పనిచేస్తున్నాము. వ్యాక్సిన్‌ల వాడకం చాలా బాగా పనిచేస్తోంది. దీంతో చికిత్సా విధానంలో మంచి మార్పులు రాబోతున్నాయని ఆశిస్తున్నాను. త్వరలో మంచి వార్తను అందించబోతున్నాం అని డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. కాగా , అమెరికాలో ఇప్పటి వరకు 34 లక్షల మంది కరోనా బారిన పడగా, ఈ మహమ్మారి కారణంగా 1,37,000 మంది మరణించారు. కేసులలోనూ, మరణాలలోనూ అమెరికానే మొదటి స్థానంలో ఉంది.