Begin typing your search above and press return to search.

మోడీ తాజా టూర్ లో తెలంగాణలో ఉండేది 135 నిమిషాలేనా?

By:  Tupaki Desk   |   26 May 2022 3:43 AM GMT
మోడీ తాజా టూర్ లో తెలంగాణలో ఉండేది 135 నిమిషాలేనా?
X
ఏదైనా రాష్ట్రాన్ని తాము టార్గెట్ చేసినట్లైయితే.. ఏదో ఒక పేరు మీదా.. మరేదో కార్యక్రమం కోసం ఆ రాష్ట్రానికి అదే పనిగా రావటం మోడీషాలకు అలవాటు. తాజా పరిణామాల్ని చూస్తుంటే.. తెలంగాణ రాష్ట్రం మీద ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వితీయ వార్షికోత్సవం కమ్ స్నాతకోత్సవం సందర్భంగా హైదరాబాద్ కు మరోసారి రానున్నారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు.. అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించే కేంద్రమంత్రి అమిత్ షా వచ్చిన మూడు వారాల వ్యవధిలోనే తెలంగాణకు రావటం విశేషంగా చెప్పాలి.

గురువారం మధ్యాహ్నం మొదలయ్యే ఈ ప్రోగ్రాం.. సాయంత్రానికి ముగియనుంది. మరింత వివరంగా చెప్పాలంటే.. తెలంగాణలో ల్యాండ్ అయినప్పటి నుంచి టేకాఫ్ అయ్యే వరకు తెలంగాణ గడ్డ మీద ప్రధానమంత్రి మోడీ ఉండే సమయం అక్షరాల 135 నిమిసాలు మాత్రమే. దీనికి సంబంధించిన తాజా షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేశారు. ఈ కొద్దిపాటి సమయంలోనే వీలైనన్ని కార్యక్రమాల్ని తెలంగాణ బీజేపీనేతలు సిద్ధం చేయటం విశేషం. తాజా పర్యటన తెలంగాణ బీజేపీ నేతలకు మరింత జోష్ ను ఇచ్చేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

రానున్న రోజుల్లోనూ బీజేపీ జాతీయ నేతలు వరుస పెట్టి రాష్ట్రానికి వచ్చేలా షెడ్యూల్ ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. మోడీకి స్వాగతం పలకటం.. వీడ్కోలు చెప్పటం లాంటి వాటి కోసం ఇప్పటికే పక్కాగా ప్లాన్ సిద్ధమైంది. బేగంపేట ఎయిర్ పోర్టుకు రావటంతో మొదలయ్యే మోడీ తెలంగాణ పర్యటన.. మళ్లీ బేగంపేట నుంచి టేకాఫ్ తీసుకోవటంతో ముగియనుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మోడీ పాల్గొనే ఐఎస్ బీ స్నాతకోత్సవంలో 1200 మంది విద్యార్థులకు పాస్ లు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రధాని ప్రయాణించే అవకాశం ఉన్న ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా భారీ కటౌట్లు.. ఫ్లెక్సీలు.. తోరణాలు.. హోర్డింగ్ లు ఏర్పాటు చేయటం గమనార్హం. బేగంపేట వేదికగా ప్రధాని మోడీ కాసేపు ప్రసంగిస్తారని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు పది నిమిషాలు మోడీ ప్రసంగించే వీలుందంటున్నారు. ప్రధాని పర్యటన కోసం దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకునే మోడీ.. తిరిగి అదే విమానంలో చైన్నైకు వెళ్లనున్నారు.

తెలంగాణలో ప్రధాని మోడీ షెడ్యూల్ చూస్తే..

మధ్యాహ్నం 1.25 ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు రాక.

మధ్యాహ్నం 1.30 ప్రధానికి గవర్నర్ తమిళ సై.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. రాష్ట్ర మంత్రి తలసాని.. టీ బీజేపీ అధినేత బండి సంజయ్.. సీఎస్.. డీజీపీ.. మేయర్ స్వాగతం

మధ్యాహ్నం 1.31 - 1.50 హెచ్ సీయూ వెళ్లేందుకు ఏర్పాటు కానీ.. బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద తనను కలిసేందుకు

సిద్ధంగా ఉన్న బీజేపీ నేతల్ని కలిసేందుకు వీలుగా 19 నిమిషాలు కేటాయించారు (లూజ్ టైం)

మధ్యాహ్నం 1.50 ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరి హెచ్ సీయూ క్యాంపస్ లో ల్యాండింగ్

మధ్యాహ్నం 1.51 - 1.59 హెచ్ సీయూ నుంచి రోడ్డు మార్గంలో ఐఎస్ బీకి వాహనంలో ప్రయాణం

మధ్యాహ్నం 2 గంటలకు ఐఎస్ బీ స్నాత్సకోవ వేదికకు చేరుకుంటారు

మధ్యాహ్నం 2 - 3.15 స్నాతకోత్సవంలో పాల్గొని.. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం

మధ్యాహ్నం 3.20 - 3.30 ఐఎస్ బీ నుంచి బయలుదేరి హెచ్ సీయూకు చేరుకోవటం

మధ్యాహ్నం 3.31 - 3.50 హెలికాఫ్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు

మధ్యాహ్నం 3.55 ప్రత్యేక విమానంలో చెన్నైకి పయనం