Begin typing your search above and press return to search.

డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్... సెకండ్ వేరియంట్ మోర్ డేంజరస్‌

By:  Tupaki Desk   |   9 May 2021 4:21 PM GMT
డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్... సెకండ్ వేరియంట్ మోర్ డేంజరస్‌
X
కరోనా వైరస్ లో ప్రస్తుతం ఎంట్రీ ఇచ్చిన సెకండ్ వేరియంట్ మ‌రింత ప్ర‌మాద‌కారి అన్న విష‌యం ఇప్ప‌టికే అవ‌గ‌తం అయిపోయింది. ఈ విష‌యాన్ని వేరెవ‌రో చెప్ప‌డం కంటే కూడా ఆ వేరియంట్ సృష్టిస్తున్న విల‌యాన్ని చూస్తేనే అర్థ‌మ‌వుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఓ కీల‌క హెచ్చ‌రిక జారీ చేసింది. క‌రోనా తొలి వేరియంట్ కంటే కూడా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన సెకండ్ వేరియంట్ చాలా ప్ర‌మాద‌కారి అని డ‌బ్ల్యూహెచ్ఓ తెలిపింది. అస‌లు ఈ వేరియంట్ ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్ని చూపుతుంద‌న్న విష‌యాన్ని కూడా డ‌బ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ గా ప‌నిచేస్తున్న భార‌త సంత‌తి వ్య‌క్తి సౌమ్య స్వామినాథ‌న్ కాస్తంత విపులంగానే చెప్పారు.

ఇంత‌కూ సెకండ్ వేరియంట్ కు సంబంధించి సౌమ్య స్వామినాథ‌న్ ఏం చెప్పార‌న్న విష‌యానికి వ‌స్తే... భారత్ లో విస్తరిస్తున్న కరోనావైరస్ వేరియంట్ కు వేగంగా వ్యాపించే లక్షణం ఉందట‌. అంతేకాకుండా వ్యాక్సిన్‌తో ఏర్పడే రోగనిరోధకతను కూడా ఈ వేరియంట్‌ తప్పించుకునే అవకాశం ఉందట‌. భారీ స్థాయిలో రూపాంతరం చెందిన వైరస్ రకాలపై వ్యాక్సిన్లు పెద్దగా పనిచేయకపోవచ్చని, అదే జరిగితే మరోసారి ప్రపంచానికి భారీ ముప్పు తప్పకపోవచ్చని ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతేడాది అక్టోబర్ లో గుర్తించిన క‌రోనాకు చెందిన బీ.1.617 వేరియంటే భారత్ లో ప్రస్తుత మహమ్మారి విలయానికి కారణమని ఆమె స్ప‌ష్టం చేశారు. స‌హ‌జంగా లేదా వ్యాక్సిన్ల ద్వారా వ‌చ్చిన‌ యాంటీబాడీల‌ను కూడా బోల్తా కొట్టించే కొన్ని మ్యుటేష‌న్లు ఈ వేరియంట్‌ లో ఉన్నాయ‌ని సౌమ్య చెప్పారు. దీనిని ఒక ప్ర‌త్యేక‌మైన వేరియంట్‌గా డ‌బ్ల్యూహెచ్‌వో కూడా ఈ మ‌ధ్య లిస్ట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా వ్యాప్తిని పెంచిన వేరియంట్లు ఎన్నో ఉన్నాయ‌ని, అందులో ఇదీ ఒక‌ట‌ని సౌమ్య స్వామినాథ‌న్ చెప్పారు. అయితే దీనిని ఇప్ప‌టి వ‌ర‌కూ ఆందోళ‌న క‌లిగించే వేరియంట్‌గా మాత్రం డ‌బ్ల్యూహెచ్‌వో గుర్తించ‌లేదు. ఇప్ప‌టికే అమెరికా, బ్రిట‌న్‌లాంటి దేశాలు దీనిని ఆందోళ‌న క‌లిగించే వేరియంట్‌గా గుర్తించ‌గా.. త్వ‌ర‌లోనే డబ్ల్యూహెచ్‌వో కూడా గుర్తిస్తుంద‌ని సౌమ్య వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే... భారత్‌లో కరోనా ఉధృతికి ఈ వేరియంట్‌ ఒక్కటే కారణం కాదని స్వామినాథన్ అన్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడేందుకు సమావేశాలకు అనుమతి ఇవ్వడం వల్ల కరోనా పోరులో భారత్ ఒక రకంగా నిర్లక్ష్యం వహించినట్లయిందని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. వైరస్ వ్యాప్తి ముగిసిందని పొరబడిన ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలను విస్మరించారని ఆమె వ్యాఖ్యానించారు. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనా వ్యాప్తి నెమ్మదిగా ఉండాల్సిందని, తొలి రోజుల్లో అలానే ఉందన్నారు. అయితే, ఒక్కసారిగా కేసులు పెరగడం ప్రారంభమైందని, ఆ తర్వాత వైరస్ విలయాన్ని కట్టడి చేయడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. కేవలం వ్యాక్సినేషన్ వల్ల పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేమని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. సుమారు 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో ఇప్ప‌టిదాకా కేవలం రెండు శాతం మందికి మాత్రమే టీకా అందిందన్నారు. 70-80 శాతం మందికి కరోనా టీకా అందాలంటే కొన్ని నెలలైనా పడుతుందని తెలిపారు. అందుకే ప్రజలంతా కరోనా నిబంధనలను పాటిస్తే మహమ్మారిని కొంతవరకు కట్టడి చేయవచ్చని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు.