Begin typing your search above and press return to search.

మానవత్వం చాటిన వాలంటీర్ ... చిన్నారి కోసం శ్రీకాకుళం నుంచి బెంగళూరుకి !

By:  Tupaki Desk   |   16 Jan 2021 8:26 AM GMT
మానవత్వం చాటిన వాలంటీర్ ... చిన్నారి కోసం  శ్రీకాకుళం నుంచి బెంగళూరుకి  !
X
ఏపీలో అధికారంలోకి జగన్ సర్కార్ రాగానే .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమల్లోకి తీసుకొచ్చిన పథకం వాలంటీర్ వ్యవస్థ. మొదట్లో ఈ వాలంటీర్ వ్యవస్థ పై ఎన్నో విమర్శలు వచ్చినా కూడా దేశంలో ఈ పథకం ఆదర్శంగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి కూడా వాలంటీర్ వ్యవస్థ ను ప్రశంసించింది. ఎన్నో సందర్భాల్లో వాలంటీర్లు మానవత్వం చాటుకున్నారు. తాజాగా మరో వాలంటీర్ మానవత్వం చాటుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... గెల్లంకి రవికుమార్, సుధారాణిలది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓండ్రుజోల గ్రామం. అయితే కొన్ని రోజుల కిందట ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. అంతలో తమ రెండున్నరేళ్ల చిన్నారికి క్యాన్సర్‌ అని తెలిసింది. అక్కడే బిడ్డకు వైద్యం చేయిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.3.5 లక్షల అప్పులు చేశారు. అవి సరిపోలేదు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇక తమ బిడ్డను ఆదుకునేది ‘ఆరోగ్యశ్రీ’ మాత్రమేనని నమ్మి ఓండ్రుజోలలోని తమ వలంటీర్‌ బరాటం నరసింగరావుకు ఫోన్‌ ద్వారా విషయం చెప్పారు. తల్లిదండ్రులు ఈకేవైసీ చేయిస్తేనే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందని వలంటీర్ ‌వారికి చెప్పడంతో.. తమ బిడ్డ ప్రమాదకర స్థితిలో ఉన్నాడని, ఈ పరిస్థితుల్లో ఊరికి రావడం తమకు అసాధ్యమని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

వారి దుస్థితికి చలించిపోయిన వలంటీర్‌ బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 13వ తేదీన ఒండ్రుజోల నుంచి బయల్దేరి వెళ్లాడు. బెంగళూరులోని సెయింట్‌ జాన్సన్‌ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న చిన్నారి వద్దకు 14వ తేదీన చేరుకుని, తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలి ముద్రలు కూడా తీసుకుని ఈకేవైసీ చేయించాడు. ఇక ఆరోగ్య శ్రీ కార్డు మంజూరవుతుందని, సంక్రాంతి సెలవుల తర్వాత కార్డు ముద్రించి ఇస్తామని భరోసా ఇచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ చిన్నారి కోసం బెంగళూరు వచ్చిన వలంటీర్‌కు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.