Begin typing your search above and press return to search.

విశాఖ ఒక్కటే అంటే అతి పెద్ద తంటావే... ?

By:  Tupaki Desk   |   9 Dec 2021 5:40 AM GMT
విశాఖ ఒక్కటే అంటే అతి పెద్ద తంటావే... ?
X
జగన్ కి బలం బలగం అంతా కూడా రాయలసీమ జిల్లాలు అని చెప్పాలి. ఎందుకంటే 2014లో జగన్ పార్టీకి 67 సీట్లు వచ్చాయి. అందులో మెజారిటీ సీట్లు నాలుగు సీమ జిల్లాలవే ఉన్నాయి.

ఇక 2919 ఎన్నికలను తీసుకుంటే మొత్తానికి మొత్తం సీమను ఊడ్చేసింది వైసీపీ. ఆ విధంగా సీమలో ఏకపక్ష విజయాలను సొంతం చేసుకున్న ఘనంత జగన్ దే. వైఎస్సార్ కానీ అంతకు ముందు ఉన్న నాయ‌కులు కానీ చేయని విధంగా అరుదైన ఫీట్ ని జగన్ చేసి చూపించారు.

అలాంటి సీమ ఇపుడు తమకు అన్ని విధాలుగా అన్యాయం జరిగింది అని ఒక వైపు ఘోషిస్తోంది. కర్నూల్ రాజధాని ఇచ్చి అలా లేకుండా చేశారని, శ్రీభాగ్ ఒప్పందాలు ఏవీ అమలు కాలేదన్న దశాబ్దాల బాధ సీమ జనాలది, కోస్తాతో పోల్చుకుంటే సీమ అన్ని విధాలుగా వెనకబడినది అని శ్రీక్రిష్ణ కమిషన్ తో పాటు శివరామక్రిష్ణ కమిషన్ కూడా తేల్చి చెప్పింది.

ఇక జగన్ కి అంతటి బంపర్ మెజారిటీ ఇచ్చి అధికారం అప్పచెప్పడానికి కూడా సీమ బిడ్డగా ఆయన తమకు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే.

అయితే జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నారు. ఒక విధంగా సీమకు దశాబ్దాలుగా జరిగిన నష్టాన్ని ఆయన గుర్తించారు. అయితే సరైన న్యాయం చేసే విధంగా ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలు ఉన్నాయా అంటే లేవు అనే అంటున్నారు. అమరావతిని రాజధానిగా వద్దు అనుకుంటే పెట్టాల్సింది కర్నూల్ లోనే అంటోంది సీమ జనం.

తమకు రాజధాని రాజసం కావాలని వారు గట్టిగానే చెబుతున్నారు. అధికార కార్యకలాపాలు, పాలన మొత్తం తమ వైపు నుంచి సాగితేనే సీమకు ఎప్పటికైనా అభివృద్ధి అన్నది కనిపిస్తుంది అన్నది వారి ఆలోచన.

అయితే జగన్ మాత్రం సీమకు హైకోర్టు అంటున్నారు. ఇక విశాఖనే పాలనా రాజధానిగా చేస్తామని చెబుతున్నారు. ఇపుడు మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేయడం వల్ల రాయల‌సీమ నుంచి నిరసన వస్తోంది. అధికార వికేంద్రీకరణ అని ఊదరగొట్టి చివరికి దాన్ని రద్దు చేయడమేంటని ఆ ప్రాంత వాసులతో పాటు మేధావులు కూడా మండుతున్నారు.

ఇదిలా ఉంటే విశాఖనే ఏకైక రాజధాని చేస్తారంటూ వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం పట్ల సీమ రగులుతోంది. ఇప్పటికే అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఉన్న విశాఖను రాజధాని చేయడం కంటే కర్నూల్ ని చేస్తేనే అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుంది అన్నది మేధావుల మాట. అదే విధంగా ఇక మీదట ఏపీలో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే ప్రతీ పైసాలో సింహ భాగం సీమకే ఖర్చు చేయాలని కూడా వారు కోరుతున్నారు.

తమకు హైకోర్టు వద్దు, ఏకంగా రాజధాని కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇపుడు వైసీపీ సర్కార్ అతి పెద్ద చిక్కుల్లో పడిపోయింది అనుకోవాలి. అమరావతిని కెలికి మూడు రాజధానులు అంటూ ప్రాంతీయ వివాదాలకు వైసీపీ ఏలికలు పొగ రాజేశారా అన్న చర్చ కూడా వస్తోంది. అయితే వైసీపీ ఈ రోజుకి కూడా సీమ సెంటిమెంట్ ని పట్టించుకోకుండా విశాఖనే రాజధాని చేస్తామని లీక్స్ పంపుతోంది.

అంతే కాదు ఏకైక రాజధాని అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక కొత్త ఏడాది ఉగాది నాటికి ఈ మేరకు ప్రకటన రావచ్చు అంటున్నారు. మరి ఇదే నిజమైతే మాత్రం సీమలో ఉవ్వెత్తున నిరసన చెలరేగడం ఖాయం.మరో వైపు దక్షిణ కోస్తా జిల్లాలు కూడా వైసీపీకి యాంటీ అవడం కూడా తధ్యమని అంటున్నారు. మరి ఇవన్నీ తెలిసేనా వైసీపీ ఈ దూకుడు చేస్తోంది అంటే ఏమో చూడాలి మరి.