Begin typing your search above and press return to search.

వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌.. యోగీకి కొత్త చిక్కులు..!

By:  Tupaki Desk   |   12 July 2020 11:30 AM GMT
వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌.. యోగీకి కొత్త చిక్కులు..!
X
ఉత్తరప్రదేశ్ లో మళ్లీ కులరాజకీయాలు చిచ్చు రేపుతున్నారు. గడిచిన పాతికేళ్లుగా యూపీలో కులరాజకీయాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. తొలినుంచి ఇక్కడ ఠాకూర్ల, బ్రహ్మణులు పడదనే విషయం అందరికీ తెలుసు. కిందటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఠాకూర్‌ సామాజికవర్గానికి చెందిన యోగి ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యారు. నాటి నుంచే బ్రహ్మణులు బీజేపీ పై కినుక వహించారు. యోగీ ప్రభుత్వం బ్రహ్మణులు పట్టించుకోవడం లేదని ఆవర్గం నేతలు పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలోనే బ్రహ్మణ వర్గానికి చెందిన వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ యూపీలో చిచ్చురేపుతోంది.

మరోసారి యూపీలో కుల రాజకీయాలు తెరపైకి వచ్చాయి. యోగీ ప్రభుత్వంపై, ఠాకూర్లను విమర్శిస్తూ బ్రహ్మణ వర్గానికి చెందిన నేతలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ చేసింది వికాస్‌దూబే అనే గ్యాంగ్‌స్టర్‌ను కాదని.. బ్రాహ్మణ గౌరవ ప్రతిష్టలను అంటూ సోషల్‌ మీడియాలో యూపీ బ్రాహ్మణులు పోస్టులు పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. వికాస్ దూబే బ్రాహ్మణ సామాజికవర్గానికి అమితంగా ప్రేమించే, గౌరవించే పులిలాంటి వ్యక్తి అని.. పరుశురాముడి ప్రతినిధి వికాస్ దూబే అంటూ కీర్తిస్తున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ తో బ్రాహ్మణులపై తమకున్న కోపాన్ని ఠాకూర్లు మరోసారి ప్రదర్శించారని ఆరోపిస్తున్నాయి.


వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌ తర్వాత యూపీలో ఠాకూర్స్‌ వర్సెస్‌ బ్రాహ్మణుల మధ్య గొడవలు తెరపైకి మరోసారి వచ్చాయి. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ బ్రాహ్మణ వర్గాన్ని ఏమాత్రం పట్టించుకోదని ఆరోపిస్తున్నారు. వికాస్ దూబేను పోలీసులు అదుపులోకి తీసుకున్న తొలుత వారి ఆగ్రహం ముస్లింలవైపు మళ్లింది. దమ్ముంటే తబ్లిగి జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. అయితే దూబే ఎన్‌కౌంటర్‌ తర్వాత వారి ఆగ్రహం యోగీ సర్కార్ వైపు మళ్లింది.

వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌ కేవలం కక్ష సాధింపుగానే యూపీ బ్రహ్మణులు చూస్తున్నారు. యోగీ హయాంలో బ్రహ్మణుల ఆధిపత్యం తగ్గిపోతుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని వాదనలు విన్పిస్తున్నాయి. బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తుండటంతో యోగీ సర్కార్ ఈవిషయంలో ఎలా ముందుకెళుతుందోననే ఆసక్తి నెలకొంది.