Begin typing your search above and press return to search.

రికార్డుల్లో తిట్ట‌లేదు.. సాయిరెడ్డీ.. కానీ.. ఆఫ్ ది రికార్డుగా ఏకేశారుగా!

By:  Tupaki Desk   |   28 Nov 2021 5:43 PM GMT
రికార్డుల్లో తిట్ట‌లేదు.. సాయిరెడ్డీ.. కానీ.. ఆఫ్ ది రికార్డుగా ఏకేశారుగా!
X
టీడీపీ అధినేత చంద్రబాబును అసెంబ్లీలో ఎవరూ తిట్టలేదని, అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని వైసీపీ కీల‌క నాయ‌కుడు ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఏడుపు ఒక డ్రామా అని తప్పుబట్టారు. ఆయన నాటకాలు ఎవరూ నమ్మరన్నారు. ఢిల్లీలో ఆదివారం జ‌రిగిన అఖిలపక్ష సమావేశంలో సాయిరెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల రెండో రోజు.. స‌భ‌లో జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆయ‌న స్పందించారు. చంద్ర‌బాబునుకానీ, ఆయ‌న కుటుంబాన్ని కానీ.. అంత‌కుమించి ఆయ‌న స‌తీమ‌ణిని కానీ.. ఎవ‌రూ తిట్ట‌లేద‌న్నారు. అవ‌స‌ర‌మైతే.. అసెంబ్లీ రికార్డులు చూడాల‌న్నారు.

అయితే.. వాస్త‌వానికి రికార్డుల్లో లేద‌ని.. టీడీపీ నేత‌లే చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు కూడా స్ప‌ష్టం చేశారు. ఆఫ్ ది రికార్డుగా.. త‌మ కుర్చీల వ‌ద్ద‌కు వ‌చ్చి.. అంబ‌టి రాంబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వంటివారు.. త‌న స‌తీమ‌ణిపై అన‌రాని మాటలు అన్నార‌ని చెప్పారు. ఇక‌, ఇదే విష‌యాన్ని.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా అంగీక‌రించారు. ఆఫ్ రికార్డుగా ఏదైనా కామెంట్లు చేసి ఉంటార‌ని.. ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. ఇలా చేసిన వ్యాఖ్య‌లు కౌంట్ కావ‌ని చెప్పారు. అంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు.. అన‌రాని మాట‌లు అన్నార‌నే క‌దా.. దీని అర్ధం. ప‌రోక్షంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అంగీక‌రించిన‌ట్టేక‌దా? అంటున్నారు టీడీపీ నాయ‌కులు.

కానీ, ఘ‌న‌త వ‌హించిన సాయిరెడ్డి మాత్రం.. ఏమీ అన‌లేద‌ని.. రికార్డులు చూడాల‌ని చెబుతున్నారు. ఆఫ్ దిరికార్డు గా చేసిన వ్యాఖ్య‌లు ప‌రిశీలించాల‌ని.. టీడీపీ నేత‌లు చెబుతుంంటే.. ఈయ‌న మాత్రం రికార్డులు చూడాల‌ని అన‌డం.. ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అదేసమ‌యంలో చంద్ర‌బాబు ఏడుపు డ్రామా అంటూ.. సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇవి కూడా రెచ్చ‌గొట్టే ధోర‌ణ‌లోలోనే ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. ఉన్న‌త‌స్థాయిలో ఉన్న సాయిరెడ్డి వంటి వారు.. వాటిని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయాలి. కానీ..ఇ ప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మాత్రం రెచ్చ‌గొట్టేలా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ఇదిలావుంటే.. పార్ల‌మెంటులో వైసీపీ ఎంపీలు అనుస‌రించే ధోర‌ణిని సాయిరెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. కనీసం మద్దతు ధర చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఆహార భద్రత చట్టం అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది దానిని సరిదిద్దాలని కోరామ‌న్నారు. మహిళా రిజర్వేషన్లు బిల్లును ఆమోదించాలని కోరామని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన దిశ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. వీటికి అంగీక‌రించ‌ని ప‌క్షంలో త‌మ వ్యూహం త‌మ‌కు ఉంద‌ని తేల్చి చెప్పారు.