Begin typing your search above and press return to search.

కేసీఆర్ పైకి ఉగ్ర‌వాదుల అస్త్రం వ‌దిలిన రాముల‌మ్మ‌

By:  Tupaki Desk   |   11 Feb 2022 11:30 AM GMT
కేసీఆర్ పైకి ఉగ్ర‌వాదుల అస్త్రం వ‌దిలిన రాముల‌మ్మ‌
X
మీడియాలో త‌క్కువ క‌నిపించిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో వివిధ అంశాల‌పై స్పందించే బీజేపీ నాయకురాలు విజయశాంతి తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై మ‌ళ్లీ విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను టీఆర్ఎస్ స‌ర్కారు ఉగ్ర‌వాదులుగా చూస్తోంద‌ని ఆమె విరుచుకుప‌డ్డారు. ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించి జీవో 317కు సవరణలు చేయాలని ఇందిరాపార్కులో శాంతియుతంగా నిరసన చేయాలనుకున్న ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడంపై విజ‌య‌శాంతి ఫైర్ అయ్యారు.

ప్ర‌శ్నించే గొంతంటే కేసీఆర్‌కు న‌చ్చ‌దని.. వారిని ఎలాగైనా నోరు మెదప‌కుండా చేయడానికి ఎన్ని పన్నాగాలైన చేస్తాడని ఆమె విమర్శించారు.

317 జీవోపై ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు... టీఆర్ఎస్ నిరసనలకు మాత్రం అనుమతినివ్వడం సిగ్గుచేటని విజ‌య‌శాంతి మండిప‌డ్డారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాకుండా.. కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే అమలవుతోందనడానికి ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ఉద్య‌మంలో ఉద్యోగుల కోసం ఎంతో చేస్తాన‌ని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్... అధికారంలోకి వ‌చ్చాక వారిని పట్టించుకున్న పాపాన పొలేదని అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ సాధ‌న‌లో ఉద్యోగులు ఉద్యమకార్లలా కన్పిస్తే... ఇప్పుడేమో ఉగ్ర‌వాదుల్ల క‌నిపిస్తున్నరా? అని ప్రశ్నించారు. జీవో 317 వ‌ల్ల తమకు ఆన్యాయం జ‌రుగుతుంద‌ని... న్యాయం చేయమని ఉద్యోగులు ఎంత మొరపెట్టుకున్న‌ా కేసీఆర్ దొర‌వారికి మాత్రం వినబడటం లేదని విజయశాంతి అన్నారు.

పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లుతోందని పోరాడి తెలంగాణను సాధించుకున్నమో... అదే తెలంగాణలో మళ్లీ స్థానికత కోసం... ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళన బాధాకరమని విజ‌య‌శాంతి వాపోయారు. రాష్ట్రం వచ్చిన త‌ర్వాత ఎలాంటి సమస్యలుండవని ఆశిస్తే... గత పాలకులకన్నా కేసీఆర్ నిరంకుశ పాల‌న చేస్తుండని అన్నారు.

ఈపాల‌న‌కు రానున్న రోజుల్లో ప్ర‌జ‌లే ముగింపు ప‌లుకుతారని విజయశాంతి అన్నారు.