Begin typing your search above and press return to search.

మాదాపూర్ లో 924 గజాలు రూ.17.25 లక్షలేనా?

By:  Tupaki Desk   |   22 Feb 2020 2:30 PM GMT
మాదాపూర్ లో 924 గజాలు రూ.17.25 లక్షలేనా?
X
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు హాస్యస్పదంగా ఉంటాయి. ఎందుకు - ఏ ఉద్దేశంతో ప్రకటిస్తారో గానీ ప్రతియేటా ఒక వారం రోజుల పాటు ఆ ఆస్తుల లెక్కలతో ప్రత్యర్థి పార్టీలకు పండగల ఉంటుంది. రోజు ఆ లెక్కల్లో ఏ అంశం పరిశీలించినా భిన్నంగా కనిపిస్తాయి. వాస్తవ లెక్కల చెప్పకుండా ఇష్టమొచ్చిన రీతిలో వారు లెక్కలు చూపిస్తుండడంతో వాటిని ఇప్పటి పరిస్థితులతో బేరీజు వేసుకుంటే నవ్వపుకోలేకపోతాం. మొన్న నారా లోకేశ్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఇవిగో ఆ ఆస్తులు.. మేం అవినీతి చేయలేదు.. కష్టపడి సంపాదించాం అని చెబుతూ వివరాలు వెల్లడించారు.

ఆ నారా కుటుంబం ఆస్తులు పరిశీలించిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి లోకేశ్ - చంద్రబాబుపై ట్విట్టర్ లో గట్టిగా వేసుకున్నాడు. అయితే ఆ వివరాలన్నీ ప్రధాన పత్రికల్లో సమగ్రంగా వచ్చాయి. వాటిని తీక్షణంగా పరిశీలిస్తే ఒకచోట సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేది కనిపించింది. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ కొలువైన ప్రాంతంలో - అత్యంత విలువైన చోట చంద్రబాబు కోడలు బ్రాహ్మణికి 924 గజాల స్థలం ఉందని ప్రకటించారు. అయితే ఆ స్థలం విలువ కేవలం రూ.17.25 లక్షలుగా ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అంతటి కాస్ట్ లీ ప్రాంతంలో వారికి అంత తక్కువ విలువకు భూమి ఉండడం సందేహాలు వస్తున్నాయి.

సాధారణంగా వెనకబడిన జిల్లాల్లోని చిన్న చిన్న పట్టణాల్లోనే 924 గజాలకు అంత తక్కువ విలువ ఉండదు. ఉదాహరణకు.. తెలంగాణలోని నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణం ఉంది. రాష్ట్రానికి సరిహద్దులో కర్నాటకలోని రాయిచూరుకు సమీపంలో ఉంది. అక్కడ ఇటీవల ఓ మహిళ 400 గజాలు రూ.7 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ స్థలం శివారు ప్రాంతంలో ఉంది. అందే పట్టణం నడిమధ్యన అయితే రూ.12-15 లక్షల దాక పలికే అవకాశం ఉంది. మారుమూల పట్టణం మక్తల్ లోనే కేవలం 400 గజాలకు అంత ధర పలికితే రాష్ట్ర రాజధాని ఐటీ పరిశ్రమ కొలువైన ప్రాంతం - అత్యంత విలువైన ప్రాంతంలో 924 గజాల స్థలం రూ.17.25 లక్షలుగా ప్రకటించడంతో ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలనే హైదరాబాద్ లో భూముల ధరలు భారీగా పెరిగాయని పలు సర్వేలు - స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి.

ఈ క్రమంలోనే లోకేశ్ భార్యకు ఉన్న స్థలం విలువ తక్కువ ఉండడం చూస్తే ఆ సర్వేలు తప్పా? లేక లోకేశ్ లెక్కలు తప్పా? అనే ప్రశ్న మొదలవుతోంది. ఈ లెక్కలు - అంకెలు చూసి వైఎస్సార్సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కాకి లెక్కలు ప్రజలు ఎవరూ నమ్మరని - అసలు మిమ్మల్ని ఆస్తుల లెక్కలు ఎవరూ ప్రకటించమని అడుగుతున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి ప్రకటించి పరువు పోగొట్టుకోవద్దని హితవు పలుకుతున్నారు.