Begin typing your search above and press return to search.

వైసీపీకి ఝలక్.. ఆ ఎమ్మెల్యే టీడీపీలోకే....?

By:  Tupaki Desk   |   20 Jan 2022 2:30 AM GMT
వైసీపీకి ఝలక్.. ఆ ఎమ్మెల్యే టీడీపీలోకే....?
X
రాజకీయాల్లో పార్టీల అధినేతలు ఒకలా ఆలోచిస్తారు. తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఆ విధంగా తామే సక్సెస్ అయ్యామని అనుకుంటారు. అయితే అక్కడ గెలిచింది ఎవరూ కాదు, పరిస్థితులు మాత్రమే. ఆ విధంగా  2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో విశాఖ లాంటి సిటీ మీద ఆ పార్టీ కన్ను పడింది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని కూడా ప్రకటించింది.

దాంతో విశాఖ సిటీ రాజకీయాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది. సిటీలో నాలుగుకు నాలుగు సీట్లూ టీడీపీయే గెలుచుకుంది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకునేందుకు సామదాన బేధ దండోపాయాలను ఉపయోగించింది. అలా వైసీపీ వైపు జరిగిన వారిలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. ఆయన రెండేళ్ల క్రితం జగన్ సమక్షంలో తన కుమారులను చేర్పించి తానూ ఫ్యాన్ నీడనే అని చెప్పేసారు.

గత రెండేళ్ళుగా ఆయన అధికార వైసీపీ కార్యక్రమాలలో  చురుకుగా పాల్గొంటున్నారు. తన నియోజకవర్గం వరకూ పనులు చేయించుకుంటున్నారు. ఇక వైసీపీలో ఉండడంతో ఆయనకు రాజకీయ ఇబ్బందులు కూడా తగ్గాయి. అయితే వచ్చే ఎన్నికల్లో వాసుపల్లికి టికెట్ వైసీపీ నేతలు ఇస్తారా లేదా అన్నది ఒక డౌట్ అయితే టికెట్ ఇచ్చినా ఆ పార్టీలో ఉన్న గ్రూపుల వల్ల తనను ఓడిస్తారేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయట.

మరో వైపు చూస్తే వైసీపీలో ఈ సీనియర్ ఎమ్మెల్యే ఇమడలేకపోతున్నారుట. అందుకే ఆయన గో టూ పెవిలియన్ అని టీడీపీలోకి రావాలని చూస్తున్నారుట. ఈ మధ్యనే ఆయన దానికి సంబంధించి తన మనసులోని మాటను కీలక నేత ద్వారా చంద్రబాబుకు చేరవేశారని చెబుతున్నారు. ఈ సమయంలో వైసీపీకి మద్దతు తెలిపిన తమ పార్టీ ఎమ్మెల్యే, బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడు వస్తానూ అంటే బాబు నో చెప్పే చాన్సే లేదు. అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారుట.

మొత్తానికి వాసుపల్లి గణేష్ కుమార్ తొందరలోనే వైసీపీ నీడ నుంచి టీడీపీ గూటికి చేరుతారు అని అంటున్నారు. ఇక ఆయనతో పాటు గతంలో పార్టీని వీడిన మరికొంతమంది కూడా సైకిల్ ఎక్కుతారు అని అంటున్నారు. ఆ విధంగా విశాఖలో టీడీపీకి మళ్ళీ ఫుల్ జోష్ తీసుకురావడానికి చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే వాసుపల్లి టీడీపీలోకి వచ్చినా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ హామీ ఇస్తారా అన్నది కూడా చర్చగానే ఉంది. ఇప్పటికే విశాఖ సౌత్ టీడీపీ ఇంచార్జిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని పార్టీ నియమించింది. దాంతో వాసుపల్లి కచ్చితమైన హామీ తీసుకునే వస్తారు అని కూడా ఆయన అనుచరులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి వాసుపల్లి కనుక పార్టీని వీడితే వైసీపీకి సౌత్ లో గట్టి దెబ్బ అనే చెప్పాలి.