Begin typing your search above and press return to search.

బాబు, చినబాబు, పీకేలను... వంశీ కడిగిపారేశారు

By:  Tupaki Desk   |   14 Nov 2019 2:03 PM GMT
బాబు, చినబాబు, పీకేలను... వంశీ కడిగిపారేశారు
X
యువ రాజకీయ నేత, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్... మౌనం వీడారు. మీడియా ముందుకు వచ్చారు. ఇంకేముంది... సింగిల్ ప్రెస్ మీట్లోనే ఆయన ఏకంగా ముగ్గురు బడా నేతలను ఏకి పారేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లే లక్ష్యంగా వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తాను టీడీపీ ఎమ్మెల్యేగానే ఉంటూ వైసీపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తానని... ఏం చేసుకుంటారో చేసుకోండని కూడా వంశీ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉండి, వైసీపీ సర్కారుకు మద్దతు ఇవ్వడం సరికాదని చెబుతూనే... ఆ విషయం తెలిసి కూడా ఆ మాదిరే నడవనున్న తనపై అసలు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తానన్న రీతిలో వంశీ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి, ప్రత్యేకించి చంద్రబాబును టార్గెట్ చేసినవేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మీడియా సమావేశంలో వంశీ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘మంచి కోరుకొనే వారు వైసీపీకి మద్దతివ్వాలి. నేను వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తా. సీఎం జగన్ తో కలిసి నడుస్తా. టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా. వర్దంతికి..జయంతికి తేడా తెలియని వ్యక్తి నన్ను కించపరిచేలా వార్తలు రాయించి..మెంటల్ కనెక్టవిటీ దెబ్బ తీశారు. ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి మద్దతిస్తా. అవసరమైతే రాజీనామా చేస్తా. చంద్రబాబు ఏపీలోనూ టీడీపీని తెలంగాణ తరహాలోనే చేస్తున్నారు. టీడీపీలో ఉండి.. వైసీపీకి మద్దతు ఇవ్వకూడదు.. అయినా ఇస్తా. ఏం జరిగినా ఎదుర్కొంటా. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పణంగా పెట్టి.. పార్టీ కోసం పని చేస్తే..ఆయన ఇప్పుడు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. చంద్రబాబు పుత్రరత్నం..సలహాదారులు పార్టీని ముంచేస్తున్నారు. అధికారికంగా త్వరలో వైసీపీలో చేరుతా. టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదు. ఇప్పటికే పార్టీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. జగన్ చేస్తున్న డెవలప్ మెంట్ ను చూసి..వైసీపీ ప్రభుత్వానికి..జగన్ కు మద్దతుగా నిలుస్తా. ముఖ్యమంత్రిని కలిసినప్పడు జగన్ ఇచ్చిన హామీ మేరకు కలిసి నడవాలని నిర్ణయించుకున్నా.

అదే విధంగా టీడీపీలో ఉంటూ వైసీపీకి మద్దతుగా ఉండకూడదు. అయినా ఇస్తా..దీని కారణంగా చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకున్నా..తాను ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నా. కేసులు కొత్త కాదు.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ కేసులు పెట్టారు. వాటి కోసం వైసీపికి మద్దతు ఇవ్వటం లేదు. పరిటాల రవి ఉన్న సమయం నుండి జగన్ తెలుసన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ నేతల సమస్యలు ఉంటే ఆయన వద్దకు వెళ్లి పరిష్కరించాన. సాధ్యమైనంత త్వరగా వైసీపీలో చేరుతా. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? ఆయన్ను ఎవరు ఆపారు. చినబాబు.. ఉమా.. బంగీ జంప్ లు చేసిన వారు నాకు వ్యతిరేకంగా పని చేశారు. వర్దంతి..జయంతికి తేడా తెలియని వాళ్లు నా కేరెక్టర్ అసాసినేట్ చేస్తే..భరించాలా? లోకేశ్ ను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించుకోలేక పోయారు. టీడీపీ ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదు. అలాంటి పార్టీ 2014లో జనసేన..బీజేపీతో పొత్తు పెట్టుకొని మూడేళ్ల తరువాత విడిపోయారు. సుజనా చౌదరి లాంటి వాళ్లు ధర్మపోరాట దీక్షలు వద్దని చెప్పినా వినలేదు. టీడీపీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది.

అన్నా దమ్ముళ్లు వేర్వేరు పార్టీలో ఉండేవారు..వియ్యంకులు వేర్వేరు పార్టీలో ఉండే వారు చంద్రబాబును డ్రైవ్ చేస్తున్నారు. ఒంటరిగా గెలిచే బలం టీడీపీకి ఎందుకు లేకుండా పోయిందని వంశీ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ను ఆర్టీసీ కార్మికులు కలిస్తే... తాను కేసీఆర్ తో మాట్లాడతానని చెప్పిన పవన్... అక్కడికి ఎందుకు వెళ్లలేదు? అదే పవన్ ఏపీలో ప్రశ్నిస్తారు. పవన్ విధానం తెలంగాణలో ఒకలా, ఏపీలో ఒకలా ఉంది. ఇది లాలూచీ కాదా? తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు చంద్రబాబు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? ఓటుకు నోటు కేసు భయపెడుతోందా? ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలే అయ్యింది. ఈ ఐదు నెలల పాలనపైనే దీక్షలు, ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంటీ? ఇసుక సమస్య పరిష్కారం అవుతుంది. రైతు రుణమాఫీ కోసం మీరెంత సమయం తీసుకున్నారు? బంగీ జంప్ చేసిన వారు సైతం వైసీపీలోకి వచ్చేందుకు యత్నించారు. అయితే ఖాళీ లేక ఆగిపోయారు’’అంటూ ఒకే ప్రెస్ మీట్ లో వంశీ... బాబు, చినబాబు, పవన్ కల్యాణ్ లను ఓ ఆటాడేసుకున్నారని చెప్పక తప్పదు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించిన వంశీ.. టీడీపీ నేతల నోట నుంచి మాట రాకుండా చేశారని కూడా చెప్పక తప్పదు.