Begin typing your search above and press return to search.

ఏపీలో జోరుగా వ్యాక్సినేషన్.. 3 రోజుల్లో 28లక్షల టీకాలు.. ఇప్పటివరకు ఎంతంటే?

By:  Tupaki Desk   |   14 Sep 2021 3:21 AM GMT
ఏపీలో జోరుగా వ్యాక్సినేషన్.. 3 రోజుల్లో 28లక్షల టీకాలు.. ఇప్పటివరకు ఎంతంటే?
X
కరోనా మహమ్మారికి చెక్ పెట్టే అవకాశం ఉన్న టీకాల విషయంలో ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. మొదట్లో టీకా డోసుల కొరతను తీవ్రంగా ఎదుర్కొన్నప్పటికీ.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వేగంగా సాగుతోంది. మూడురోజుల వ్యవధిలో 28.63 లక్షల మందికి టీకాలు వేయటం గమనార్హం. ఇక.. తొలిడోస్ ను రాష్ట్రంలో 3.51 కోట్ల మందికి ఇవ్వగా.. రెండో డోస్ ను కోటి మందికి పైగా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

గడిచిన మూడు రోజులుగా స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించినట్లుగా పేర్కొంటున్నారు. ఏపీ వ్యాప్తంగా 5.3 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉండగా.. ఇప్పుడా లక్ష్యంలో సగానికి పైనే పూర్తి అయ్యింది. మిగిలిన వారికి సైతం వేగంగా టీకాలు వేసేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతన్నాయి.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు 1.08కోట్ల మంది కాగా.. సింగిల్ డోస్ ను 2.34 మందికి కనీసం సింగిల్ డోస్ తీసుకున్న వారిగా లెక్క తేల్చారు. 18 ఏళ్లు దాటిన వారికి ఇవ్వాల్సిన రెండో డోస్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు మొదటి డోస్ ను పూర్తి చేశారు. వ్యాక్సిన్ లభ్యత ఆధారంగా రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ల తరహాలో నిర్వహిస్తే.. చాలా త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పక తప్పదు.