Begin typing your search above and press return to search.

బీజేపీకి షాకిచ్చిన వీహెచ్‌ పీ... కాంగ్రెస్‌ కు మ‌ద్ద‌తుకు సై

By:  Tupaki Desk   |   20 Jan 2019 12:54 PM GMT
బీజేపీకి షాకిచ్చిన వీహెచ్‌ పీ... కాంగ్రెస్‌ కు మ‌ద్ద‌తుకు సై
X
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌ పీ)... బీజేపీకి మ‌ద్ద‌తుగా నిలిచే ఈ వేదిక తాజాగా బీజేపీకి పెద్ద షాకిచ్చే ప్రకటన చేసింది. బ‌ద్ద‌శ‌త్రువు అయిన కాంగ్రెస్‌ కు మ‌ద్ద‌తిచ్చేలా ప్ర‌క‌టించింది. ప్రయాగ్‌ రాజ్‌ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న వీహెచ్‌ పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రామమందిర నిర్మాణాన్ని తన మేనిఫెస్టోలో పెడితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

రామ మందిరంపై చట్టం తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 31న వీహెచ్‌ పీ ధర్మ సన్సద్‌ ను నిర్వహించనున్న నేపథ్యంలో వీహెచ్‌ పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ``కాంగ్రెస్ మాకు అన్ని దారులు మూసేసింది. కానీ వాళ్లు ఆ దారులు తెరిచి రామ మందిరాన్ని మేనిఫెస్టోలో చేర్చగలిగితే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తాం`` అని స్పష్టం చేశారు. ``ధర్మ సన్సద్‌ లో మఠాధిపతులు, సన్యాసుల నుంచి ఆశీర్వాదం తీసుకుంటాం. రామ మందిర అంశాన్ని కూడా వాళ్ల దగ్గర ప్రస్తావించి వాళ్ల సలహా కోరతాం. ఆ తర్వాతే ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటాం`` అని అలోక్ చెప్పారు. ఒకవేళ పార్లమెంట్‌ లో రామ మందిరంపై బిల్లు తీసుకొస్తే మద్దతివ్వాల్సిందిగా అన్ని పార్టీలను కలిసి కోరినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంలో రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని తాము భావిస్తున్నట్లు అలోక్ చెప్పారు. అన్ని పార్టీల మేనిఫెస్టోల్లోనూ ఈ అంశాన్ని పెట్టాల్సిందిగా కోరుతున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండ‌గా, వీహెచ్‌ పీ నేత వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. ముందు రామున్ని కాంగ్రెస్ వాళ్ల గుండెల్లో పెట్టుకోనివ్వండి. ఇదే పార్టీకి చెందిన కపిల్ సిబల్ ఈ అంశంపై ఎన్నికల తర్వాత విచారణ జరపాలని కోర్టుని కోరారు. మా వరకు రామ మందిరానికి కట్టుబడి ఉన్నామని ప్ర‌క‌టించారు.