Begin typing your search above and press return to search.

స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారికి సైంటిస్టుల వార్నింగ్

By:  Tupaki Desk   |   1 Jun 2020 4:30 PM GMT
స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారికి సైంటిస్టుల వార్నింగ్
X
ఈ టెక్ జ‌మానాలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆరేళ్ల ప‌సి పిల్ల‌ల నుంచి అర‌వై ఏళ్ల ముస‌లాళ్ల వ‌ర‌కు అర‌చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటోంది. కారు చౌకగా మొబైల్ డేటా....అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో, నిద్ర‌లేచింది మొదలు అర్ధరాత్రి పడుకోబోయే వరకు స్టార్ట్ ఫోన్ ను అరచేతిలో అతికించుకుంటున్నారు. కర్ణుడికి కవచకుండలాల్లాగా....చేతికి స్మార్ట్ ఫోన్ ఉంటోందంటే అతిశయోక్తి కాదు. ఫేస్` వాష్ చేయ‌క‌పోయినా ప‌ర్లేదు కానీ....`ఫేస్‌` బుక్ ఓపెన్ చేయ‌నిదే కొంద‌రికి రోజు ప్రారంభం కాదంటే నమ్మండి. ట్విట్ట‌ర్, యూట్యూబ్, గేమ్స్, చాటింగ్ ల‌లో గంట‌ల కొద్దీ స‌మ‌యం గ‌డ‌ప‌నిదే కొంద‌రికి పొద్దుపోదు. ఇక, కొంద‌రికైతే త‌మ మిత్రుల‌తో అర్ధ‌రాత్రి వ‌ర‌కు వాట్సాప్ లో చాటింగ్ చేయ‌నిదే నిద్ర ప‌ట్ట‌దు. ఈ ర‌కంగా టెక్ జ‌మానాలో స‌గ‌టు మ‌నిషి జీవితంతో స్మార్ట్ ఫోన్ పెన‌వేసుకుపోయిందంటే అతిశ‌యోక్తి కాదు.

అయితే, అతి అనర్థదాయకం అని పెద్దలు చెప్పినట్లు....మరీ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదమేనని చెబుతున్నారు. ఇలా మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకంతో స్థూలకాయం(ఒబెసిటీ) ,గుండె జబ్బులు, డయాబెటిస్, కంటి సమస్యలు, నిద్రలేమి తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొలంబియాలోని సిమోన్ బొలివర్(simon bolivar) యూనివర్సిటీకి చెందిన హెల్త్ సైన్సెస్ విభాగం 1060 మంది విద్యార్థులపై సైంటిస్టులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.

ఆ విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు. అలాగే వారు నిత్యం ఎన్ని గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతారనే వివరాలను తెలుసుకున్నారు. అన్నీ విశ్లేషించాక చివరకు తేలిందేమిటంటే.. రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ను వాడే అబ్బాయిలు స్థూలకాయం(ఒబెసిటీ) బారిన పడే అవకాశాలు 42.6 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని, అదే అమ్మాయిలు అయితే ఆ అవకాశాలు 57.4 శాతం వరకు ఉంటాయని తేల్చారు. స్థూలకాయం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకూ అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని, దీనికి తోడు నిద్రలేమి, కంటి సమస్యలు వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే, ఈ టెక్ యుగంలో స్మార్ట్‌ ఫోన్లు వాడటంలో తప్పు లేదు. కానీ ఏదైనా మితంగా వాడితేనే అందం ఆనందం...అందుకే, ఇకపై అవసరమైనపుడే ఫోన్ వాడితే...ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.