Begin typing your search above and press return to search.

ఎవరూ పీకలేరంతే...బూతులే ఊతంగా నయా రాజకీయం!

By:  Tupaki Desk   |   7 Dec 2022 12:30 AM GMT
ఎవరూ పీకలేరంతే...బూతులే ఊతంగా నయా రాజకీయం!
X
కాలం మారుతోందని దూకుడు చేస్తున్నారా లేక జనాలకు కనెక్ట్ కావాలని చూస్తున్నారా లేక కొత్తగా పొలిటికల్ టెర్మినాలజీ మార్చాలని చూస్తున్నారా ఏదైనా సరే కావచ్చు. కానీ తెలుగు రాజకీయాలో భాష మారిపోయింది. ఒకనాడు ఎక్కడో ఆవేశంతో పొరపాటుగా మాట్లాడే అసభ్య పదాలు ఇపుడు రాజకీయాల్లో ఊతపదాలుగా మారిపోతున్నాయి. వాటి చుట్టూనే రాజకీయం తిరుగుతోంది.

ఒకరి కంటే గొప్ప అనిపించుకోవాలనో లేక తమకూ ఆ భాష వచ్చు అని చూపించుకోవాలనో అందరూ అలాంటి భాషను వాడేస్తున్నారు. ఫస్ట్రేషన్ తో ఇపుడు నేతలు అనుచితమైన వాటినే మాట్లాడుతున్నారు. అదే నయా పొలిటికల్ ట్రెండ్ గా చేసుకుంటున్నారు. ఆ మధ్య నంద్యాలలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో మొదటిసారి సీఎం జగన్ అన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు అంటూ విపక్షాల మీద హాట్ కామెంట్స్ చేశారు.

దాని మీద అతి పెద్ద దుమారం చెలరేగింది. ఆ తరువాత దాన్ని అందిపుచ్చుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఏమీ పీకలేరు అంటూ మాట్లాడడం స్టార్ట్ చేశారు. నారా చంద్రబాబు, లోకేష్ ఇలా మొదలుపెడితే అగ్ర నేతలు అంతా కూడా ఈ వెంట్రుక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చారు. కింది స్థాయిలో నేతలు కూడా అటు వైసీపీ ఇటు టీడీపీలలో ఇదే భాషను ఎలాంటి సంకోచం లేకుండా వాడేస్తున్నారు.

ఆ వరసలో కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, దువ్వాడ శ్రీను తదితర నేతలు ఉన్నారు. అలాగే టీడీపీలో చూస్తే బోండా ఉమా, బుద్దా వెంక‌న్న‌, గ్రీష్మ‌, వంగ‌ల‌పూడి అనిత లాంటి నాయకులు కూడా పరుష పదజాలాన్ని వాడుతున్నారు. అది కాస్తా మరింత మసాలా జోడిస్తూ దూషణలకు కూడా దిగిపోతున్నారు. కొందరు నేతలు అయితే మా బొచ్చు కూడా పీకలేరు అని అసహ్యకరమైన భాషను సైతం వాడేస్తున్నారు.

అంతేనా గూట్లే అన్న పదంట, లుచ్చా అంట, బచ్చా నా కొడకా ఇలాంటి పదాలు కూడా ఇపుడు ఏపీ నేతాశ్రీల మీటింగ్ లో ప్రెస్ మీట్లలో అలవోకగా దొర్లేస్తున్నాయి. అంటే వెంట్రుక పీకలేవు అన్న పదం నుంచి చాలా దూరం వచ్చేశారు అన్న మాట.నిజానికి వెంట్రుక పీకలేవు అన్నది ఎంతో తప్పు పదంగా చాలా కాలం క్రితం వరకూ ఉండేది. ఇపుడు మాత్రం అది కామన్ అయిపోయింది. తిట్లు పెసరట్లు మాదిరిగా పేలుతున్నాయి.

ఎవరెన్ని తిట్లు తిడితే వారే బహు మొనగాడు అన్నట్లుగా రాజకీయం తయారైంది అని అంటున్నారు. ఈ మధ్యనే టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మాట్లాడుతూ సంకల్ప సిద్ధి కేసులో ఏపీ సీఐడీ పోలీసులు ఏమి పీకుతున్నారు. అని ఘాటైన పదజాలం ఉపయోగించేశారు. ఇలా తమ ఫ్రస్ట్రేషన్ని భాషలో చూపిస్తున్నారు. తెగ ఆయాసపడుతూ తమ ఆత్మానందాన్ని అలా పొందుతున్నారు. ఇంకో వైపు చూస్తే తెలంగాణాలోనూ ఇదే రకంగా సీన్ ఉంది అంటున్నారు.

అక్కడ కూడా మాటలు అన్నీ కూడా పరుష పదజాలంగా మారిపోతున్నాయి. మొత్తానికి రాజకీయం చేయాలీ అంటే నయా పొలిటికల్ టెర్మినాలజీని పట్టుకోవాలి. దాని కోసమే ఉన్న ప్రత్యేక డిక్షనరీని ఫాలో అవ్వాలి. లేకపోతే మీడియా ఫోకస్ ఉండదు, అంతే కాదు రేసులో వెనకబడిపోతారు. మరి ఈ విధంగా ఆలోచనలతో ముందుకు సాగుతున్నా రాజకీయాన్ని చూసిన వారు అంతా చెప్పేది ఒక్కటే. న బూతో న భవిష్యత్తు అని.