Begin typing your search above and press return to search.

సల్మాన్ రష్దీకి ఇప్పుడెలా ఉంది? వైద్యుల తాజా అప్డేట్ ఇదే!

By:  Tupaki Desk   |   14 Aug 2022 11:36 AM GMT
సల్మాన్ రష్దీకి ఇప్పుడెలా ఉంది? వైద్యుల తాజా అప్డేట్ ఇదే!
X
ఒక కార్యక్రమానికి హాజరై వేదిక మీద ఉన్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీపై అనూహ్యంగా దాడికి గురి కావటం.. ఆయన ఆ వెంటనే కుప్పకూలిపోవటం తెలిసిందే. దీంతో హుటాహుటిన హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించి.. వైద్యసేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలంనగా మారిన ఈ భారత రచయిత.. చాలా కాలంగా అమెరికాలోనే ఉండటం తెలిసిందే.

నూయార్కులో జరిగిన కార్యక్రమానికి హాజరైన సల్మాన్ పై ఒక వ్యక్తి దాడి చేయటం తెలిసిందే. కత్తితో అతడి దాడి కారణంగా.. సల్మాన్ రష్దీ ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు. భుజం నరాలుదెబ్బ తిన్నాయని.. కాలేయానికి కత్తి గాయాలు అయినట్లుగా పేర్కొన్నారు చేతి నరాలుతెగిపోవటంతోఆయన్ను.. వెంటిలేటర్ మీద ఉంచి వైద్య సేవలు అందించారు. తాజాగా ఆయనకు వైద్య సాయం అందిస్తున్న వైద్యులు చెబుతున్న దాని ప్రకారం ఆయనకు వెంటిలేటర్ ను తొలగించారు. దీంతో ప్రాణాపాయం తప్పినట్లేనని చెబుతున్నారు.

కాకుంటే గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు జరిగిన గాయాల మీదా.. చికిత్స చేస్తున్న దానిపై వివరాలు వెల్లడించేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని హాది మతార్ గా గుర్తించారు. 24 ఏళ్ల వయసున్న అతను షియా అతివాదంతో.. ఇస్లామిక్రివల్యూషనరీ గార్డ్ దళంతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా భావిస్తున్నారు. అతని సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేయగా.. ఇరాన్ సుప్రీంనేత ఆయతుల్లా ఖొమేనీ ఫోటోను పోస్టు చేసుకున్న వైనాన్ని గుర్తించారు. రష్దీని హతమారచాలని ఖొమైనీ ఫత్వా జారీ చేయటం తెలిసిందే.

ఇక.. మతార్ ఏ దేశానికి చెందిన వాడన్న విషయంపై స్పష్టత రావటం లేదు. హత్యాయత్నానికి పాల్పడిన సమయంలో నల్ల దుస్తులు.. అదే రంగు మాస్కు ధరించాడు. చౌతాక్వా ఇన్ స్టిట్యూట్ చరిత్రలో ఇలాంటి ఘాతుకాలు చోటు చేసుకోలేదని చెబుతున్నారు.

భద్రత ఎక్కువగా ఉంటే సభలకు వచ్చే వారికి ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో.. భద్రతా పరమైన సిఫార్సుల్ని పక్కన పెట్టేసినట్లుగా నిర్వాహకులు చెబుతుననారు. దీనికి తోడు.. రష్దీ సైతం తన చుట్టూ ఎక్కువ భద్రత ఉండటాన్ని ఇష్టపడేవారు కాదు. తనకు ఎక్కువ భద్రత అవసరం లేదనేవారు. చివరకు భద్రతా వర్గాల అనుమానమే నిజమైంది.

రష్దీ పై జరిగిన హత్యాయత్నం ఇరాన్ లో మిశ్రమ స్పందన లభించింది. దాడి ఘటనపై కొందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఇలాంటి వాటితో ఇరాన్ ఏకాకిగా మారుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇలాంటివి కలవరపాటుకు గురి చేస్తాయని.. స్వేచ్ఛగా భావాలు వ్యక్తీకరించే వారిపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బ్రిటన్ లో ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న రిషి సునాక్.. లిజ్ ట్రస్ లు ఈ ఉదంతంపై ఖండించారు. వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వ్యక్తిపై కత్తి కట్టటం దారుణమని అభివర్ణించారు.