Begin typing your search above and press return to search.

అనిల్‌ బోరుగడ్డకు షాకిచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు!

By:  Tupaki Desk   |   7 Feb 2023 11:00 AM GMT
అనిల్‌ బోరుగడ్డకు షాకిచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు!
X
ఏపీలో ప్రతిపక్ష నేతలను, మీడియా ప్రతినిధులను, వారి భార్యలను, పిల్లలను పచ్చి బూతులు తిడుతూ ఇటీవల కాలంలో పాపులరైన వ్యక్తి.. బోరుగడ్డ అనిల్‌. తాజాగా వైసీపీ అధిష్టానంతో విభేదించిన ఆ పార్టీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి కూడా అనిల్‌ ఫోన్‌ చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో కాల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నెల్లూరు అంగళ్లలో నిన్ను, నీ తమ్ముడిని నా బండికి కట్టి ఈడ్చుకుపోతానని బోరుగడ్డ అనిల్‌.. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిపై తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు.

తాను వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బంధువునని పలుమార్లు చెప్పుకున్న బోరుగడ్డ అనిల్‌.. జగన్‌ పై విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలను వీడియో లైవుల్లో నానా బూతులు తిట్టిన విషయం తెలిసిందే. రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవాలే) రాష్ట్ర అధ్యక్షుడుగా బోరుగడ్డ అనిల్‌ తాను వైఎస్‌ జగన్‌ కు వీరాభిమానిని పలుమార్లు చెప్పుకున్నాడు.

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేనాని పవన్‌ కల్యాణ్, తాజాగా కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలపై తీవ్ర అసభ్య దూషణలకు, బెదిరింపులకు పాల్పడ్డాడు. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తానని అనిల్‌ హాట్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. దళిత ముసుగులో ప్రతిపక్ష నేతలను బండ బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని బోరుగడ్డ అనిల్‌ పై తీవ్ర విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్‌ కు గుంటూరులో ఉన్న కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఫిబ్రవరి 7న సోమవారం అర్ధరాత్రి దాటాక గుంటూరులోని డొంకరోడ్డులో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంపై పెట్రోలు చల్లి నిప్పంటించారు. ఈ మంటల్లో అక్కడి ఫర్నీచర్‌ పూర్తిగా కాలిపోయింది.

తన కార్యాలయాన్ని తగులబెట్టిన ఘటనపై బోరుగడ్డ అనిల్‌ ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పనేనని ఆయన ఆరోపించారు. కోటంరెడ్డికి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు కొందరు సహకరించారని తీవ్ర విమర్శలు చేశారు.

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డితోపాటు టీడీపీ నేతలు చౌపాటి రత్నం, గోళ్ల అరుణ్‌ కుమార్, నక్కా ఆనంద్‌ బాబు, ఆనంద్‌ బాబు అనుచరులు, గుంటూరు టీడీపీ కార్యకర్తలు, రౌడీలు, గూండాలు తన కార్యాలయానికి నిప్పు పెట్టారని అనిల్‌ ఒక వీడియోలో ఆరోపించారు. ఇందులో ప్రధాన పాత్ర నక్కా ఆనంద్‌ బాబు, గోళ్ల అరుణ్‌ కుమార్, చౌపాటి రత్నంలదేనని మండిపడ్డారు.

తన కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సిట్‌ తో విచారణ చేయించి దోషులను శిక్షించాలని బోరుగడ్డ అనిల్‌ కోరారు. అదేవిధంగా తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని బోరుగడ్డ అనిల్‌ ప్రభుత్వానికి విన్నవించారు. తన గొంతు నొక్కే పనిని చేస్తున్నారని.. అదే జరిగే పని కాదని హెచ్చరించారు. పది అడుగుల ముందుకే వెళ్తాను తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.