Begin typing your search above and press return to search.

సీత‌మ్మ 'రూపాయి' రామాయ‌ణం.. విందురూ!

By:  Tupaki Desk   |   25 Sep 2022 4:31 AM GMT
సీత‌మ్మ రూపాయి రామాయ‌ణం.. విందురూ!
X
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. అంతేకాదు.. ఒకే రోజు కేవ‌లం 4 నిమిషాల్లో భార‌తీయుల సంప‌ద 4 ల‌క్ష‌ల కోట్లు ఆవిరైంది. మ‌రోవైపు ద్ర‌వ్యోల్బ‌ణం.. బుస‌లు కొడుతోంది. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం చాలా సున్నితంగా స్పందించారు. ``అబ్బే.. భ‌య‌ప‌డాల్సింది ఏమీలేదు.. అంతా సేఫ్‌!`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలరుతో రూపాయి బాగానే రాణిస్తోందని చెప్పారు.

రిజర్వ్‌ బ్యాంక్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. ఇతర కరెన్సీల్లా తీవ్రమైన ఒడుదొడుకులు, హెచ్చుతగ్గులకు గురికాలేదంటే అది భారత రూపాయేనని పేర్కొన్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే మనం బాగా నిలబడ్డామన్నారు. వాస్త‌వానికి రూపాయి విలువ ఎప్పుడూ లేనంతగా జీవిత కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ ఫారెక్స్‌ నిల్వలను విక్రయించొచ్చన్న అంచనాలున్నాయి.

ఉక్రెయిన్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా వేర్వేరు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్న నేపథ్యంలో.. సురక్షిత పెట్టుబడుల వైపే మదుపర్లు మొగ్గుచూపుతున్నారు. డాలరుపై పెట్టుబడులే భద్రమని వారు భావిస్తున్నారు. ఫలితంగా అమెరికన్ కరెన్సీ క్రమంగా బలపడుతోంది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఏకంగా 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మున్ముందు కూడా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని స్పష్టమైన సంకేతాలిచ్చింది.

ఈ పరిణామాల మధ్య మదుపర్లు లాభాలు బాగుంటాయనే ఆశతో అమెరికా మార్కెట్ల వైపు మొగ్గుచూపుతుండగా.. ఆ దేశ కరెన్సీ పుంజుకుంటోంది. రూపాయి ఒత్తిడికి గురవుతోంది. భారత్ దగ్గరున్న విదేశీ మారక నిల్వలు రెండేళ్ల కనిష్ఠ స్థాయికి క్షీణించాయి. ఈ ఏడాది ఆరంభంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక విదేశీ మారక నిల్వలు ఏకంగా 80 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. సాధారణంగా రూపాయి పతనాన్ని ఎదుర్కొనేందుకు రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకుంటుంది.

డాలర్ల విక్రయం ద్వారా రూపాయి మరింత క్షీణించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే.. విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆర్బీఐ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్ప‌టికే వ‌డ్డీ రేట్లు పెంచిన నేప‌థ్యంలో ఈ ద‌ఫా కూడా ఆ మార్గ‌మే ఎంచుకుంటుందా? లేక ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.