Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ అరెస్టు పై ఉండ‌వ‌ల్లి షాకింగ్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   19 Feb 2020 2:30 PM GMT
జ‌గ‌న్‌ అరెస్టు పై ఉండ‌వ‌ల్లి షాకింగ్ కామెంట్స్‌!
X
ఏపీలోని ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఎన్డీఏలో వైసీపీ చేరిక‌పై వ‌స్తోన్న ఊహాగానాల నేప‌థ్యంలో ఉండ‌వ‌ల్లి త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ చేశారు. సీబీఐ కేసుల్లో జ‌గ‌న్ అరెస్టు కాబోతున్నార‌ని, వాటి నుంచి త‌ప్పించుకోవడానికే ఎన్డీఏలో జ‌గ‌న్ చేరుతున్నార‌నే పుకార్ల‌ పై ఉండ‌వ‌ల్లి త‌న మార్క్ కామెంట్స్ చేశారు. ఏపీలో జ‌గ‌న్‌కు చాలా పెద్ద ఇమేజ్ ఉంద‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌గ‌న్‌ను అరెస్టు చేసేంత ధైర్యం కేంద్రం చేయ‌లేద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే జ‌గ‌న్‌, షాల‌ను క‌లిస్తే జ‌గ‌న్ గ్రాఫ్ పెరుగుతుంద‌ని, కొన్ని పేప‌ర్ల‌లో వ‌స్తున్న క‌థ‌నాల‌లాగా సీబీఐ కేసుల కోస‌మే క‌లిస్తే గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని అన్నారు. శ‌శిక‌ళ‌, జ‌గ‌న్ కేసులు వేర్వేర‌ని ఆయ‌న అభిప్రాయ‌ ప‌డ్డారు.

ఏపీలో ఇసుక కొర‌త కిర‌ణ్ కుమార్ హ‌యాం నుంచే ఉంద‌ని, గ‌త ప్ర‌భుత్వం ఇసుక‌లో అవినీతికి పాల్ప‌డింద‌ని, అందువ‌ల్లే జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త పాల‌సీ తీసుకు వ‌చ్చింద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. అయితే, ఆరునెల‌ల్లో ఇసుక అందుబాటులోకి తేక‌పోవ‌డం జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మేన‌ని ఉండ‌వ‌ల్లి అభిప్రాయ‌ ప‌డ్డారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత కొన్ని చానళ్లు, ప‌త్రిక‌ల‌ను ఆపేశారంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్సార్ పై మీడియా వ్యతిరేకత చూపించింద‌ని, ఆనాడు సాక్షి ప‌త్రిక‌, చానెల్ లేద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ, వైఎస్సార్ ఏనాడూ చానళ్లను, పత్రికలను నిషేధించ లేదని, ఫలానా పత్రిక లో తనకు వ్యతిరేకం గా రాస్తున్నారని మాత్రం చెప్పేవారని అన్నారు. కేసీఆర్‌, చంద్రబాబు ఇలాగే మీడియాను ఇలాగే నిషేధించార‌ని, ఆ పని జగన్ కంటిన్యూ చేస్తున్నార‌ని అన్నారు. అయితే, వ్యతిరేకంగా వచ్చే వార్తలకు భయపడిన మరుక్షణం రాజ‌కీయ నేత‌ల‌ పతనం ప్రారంభమైనట్టేన‌ని ఉండ‌వ‌ల్లి ఘాటుగా స్పందించారు.

ఎన్నికల ముందు హామీలిచ్చిన అంశాలతో పాటు హామీలు ఇవ్వని అంశాలను కూడా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అయితే, మేనిఫెస్టో తో పాటు, వైఎస్సార్ త‌న‌యుడిగా జ‌గ‌న్‌ను చూసి జ‌నం ఓటేశార‌ని అన్నారు. ఇప్పుడు అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాల‌తోపాటు పోల‌వ‌రం పై కూడా జ‌గ‌న ఫోక‌స్ పెట్టాల‌ని అన్నారు. గత సీఎం అమరావతికే ప్రాధాన్యత ఇచ్చి దానికే ఖర్చు చేశార‌ని, ఇప్పటి సీఎం ప్రజా సంక్షేమంపైనే ఎక్కువ పెడుతున్నారని అన్నారు. ఏడు లక్షల పింఛన్లు రద్దయ్యాయన్న విషయంపై ప్రచారం జరుగుతోంద‌ని, కొత్తగా ఇచ్చిన 14 లక్షల ఫింఛన్లపై ప్రచారం జరగడం లేదన్న విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తించాల‌ని అన్నారు.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత జీడీపీ ప‌డిపోయింద‌ని, దాని ప్ర‌భావం ఏపీపై ఎక్కువ‌గా ప‌డింద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగాల‌ని, జీడీపీ పెరగాల‌ని, అపుడే ట్యాక్స్ వస్తుంద‌ని చెప్పారు. అప్పుడు ఏయే కార్యక్రమాలు చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. పోలవరం ఏటీఎంలా తయారయిందని మోడీ కూడా అన్నార‌ని, అయితే, ఇందుకు సంబంధించిన లెక్కలను మాత్రం చూపలేదని చెప్పారు. పోల‌వ‌రంపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని గ‌త ప్ర‌భుత్వాన్ని కోరినా ప‌ట్టించుకోలేద‌న్నారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ కు లేఖ రాసినట్లు చెప్పారు. 14 ఏళ్ల క్రితమే వైఎస్సార్‌ ఈ ఆలోచన చేశారన్నారు.