Begin typing your search above and press return to search.

వార్ అంటే ఇలాంటి దారుణాలెన్నో.. కంటతడి పెట్టించే ఉక్రెయిన్ విషాదాలు

By:  Tupaki Desk   |   15 Aug 2022 4:40 AM GMT
వార్ అంటే ఇలాంటి దారుణాలెన్నో.. కంటతడి పెట్టించే ఉక్రెయిన్ విషాదాలు
X
ఒకరి ఆశ మరొకరికి కష్టం కాకూడదు. ఒక దేశాధినేత అత్యాశ.. ప్రపంచ ప్రజలకు కష్టంగా మారితే దాన్ని సమర్థిస్తామా? అధిక్యతను ప్రదర్శించుకోవటం కోసం వేలాది ప్రాణాల్ని పణంగా పెట్టే ఒకడి దుర్మార్గానికి యావత్ ప్రపంచం మూల్యం చెల్లించే పరిస్థితి. ఎవరెన్ని చెప్పినా ఒక మాట మాత్రం నిజం. అదేమంటే.. ఈ ప్రపంచంలో ఉన్న సుమారు 7.9 బిలియన్ జనాభాను శాసించేది.. వారి బతుకుల్ని ప్రభావితం చేసేది.. మొత్తం జనాభాలోని 0.1 శాతం మందే. శాస్త్రసాంకేతికంగా డెవలప్ అయితే ఆధునిక సమాజంలోనే అతి తక్కువమంది బలవంతులు.. మిగిలిన ప్రపంచాన్ని .. కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేసి.. వారి జీవితాల్ని కంట్రోల్ చేస్తుంటారు.

రష్యా అధినేత పుతిన్ తీసుకున్న నిర్ణయం.. ఉక్రెయిన్ లో మారణహోమాన్ని జరిపించింది. యుద్ధం అన్నంతనే.. కొందరు మహా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. శత్రుదేశాలను చితక్కొట్టేయాలని.. వారి అంతు చూడాలన్న స్టేట్ మెంట్లు ఇచ్చేస్తారు. కానీ.. మర్చిపోయేదేమంటే.. ఆధునిక కాలంలోనూ మనిషిని మనిషి చంపుకోవటం ఏమిటి? అనాదిగా వచ్చే ఈ ఆరాచకం ఇప్పటికి కొనసాగటం ఏమిటి? అన్న ప్రశ్నను మాత్రం వేసుకోరు. చంపటం ఎవరైనా చేస్తారు.. వీలైతే బతికించు.. బతుకునివ్వు అన్నదే గొప్పన్న విషయాన్ని గుర్తించే పరిస్థితి లేదు. ఇదంతా ఎందుకంటే.. ఉక్రెయిన్ మీద కన్ను కుట్టిన రష్యా అధినేత పుతిన్..ఆ దేశం మీద విరుచుకుపడటం.. అకారణంగా వచ్చిన యుద్ధంతో వేలాది మంది మరణించటం తెలిసిందే.

అయితే.. ఈ యుద్ధం కారణంగా అక్కడి పరిస్థితులకు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు గుండె తరుక్కుపోవటమే కాదు..ఇంత దారుణమైన పరిస్థితులా? అన్న వేదన కలుగక మానదు. తాజాగా ఉక్రెయిన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న దానికి సంబంధించిన రిపోర్టులు విస్మయానికి గురి చేయటమే కాదు.. కంట తడిపెట్టించేలా ఉన్నాయి. రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో వేలాది మంది కన్నుమూశారు. బాంబుల దాడిలో పిట్టల మాదిరి రాలిపోయారు. ఎప్పుడు.. ఎటు వైపు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయం తెలియక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గతంతో పోలిస్తే ఇప్పుడిప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్న వేళ.. యుద్ధం కారణంగా మరణించిన తమ వారి సమాధుల్ని అక్కడి వారు మళ్లీ తవ్వుతున్నారు. దీనికి కారణం ఏమిటో తెలుసా? యుద్ధం తారాస్థాయిలో ఉన్నప్పుడు మరణించిన వారిని హడావుడిగా ఖననం చేయటం.. నిర్వహించాల్సిన కార్యక్రమాల్ని చేపట్టకపోవటమే దీనికి కారణంగా చెబుతున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనంగా ఉక్రెయిన్ లోని లుహాన్స్క్ రీజియన్ లోని రూబిజ్నే పట్టణ ప్రజలు యుద్ధం ఉధ్రతంగా సాగే వేళలో.. మరణించిన తమ వారి సమాధుల్ని మళ్లీ తవ్విస్తున్నారు.

దాదాపు 50 వేల మంది జనాభా ఉన్న ఈ పట్టణం ప్రస్తుతం రష్యా మద్దతు ఉన్న లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ అధీనంలో ఉంది. యుద్ధ సమయంలో ధ్వంసమైన ఒక అపార్టు మెంట్ వద్ద మరణించిన వారిని అప్పట్లో హడావుడిగా ఖననం చేయటంతో.. ఇప్పుడు వారి మ్రతదేహాల్ని మళ్లీ బయటకుతీసి.. సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు వెలికి తీసిన డెడ్ బాడీస్ లో చాలావరకు బాంబు దాడులకుసంబంధించిన గాయాలు.. బుల్లెట్ గాయాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. హడావుడిగా ఖననం చేసిన వారి డెడ్ బాడీలు వెలికి తీసి వారి డీఎన్ ఏ ఆధారంగా వారికి సంబంధించిన వారిని గుర్తించి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి దారుణ పరిస్థితి యుద్ధం కారణంగానే వస్తుందన్న విషయాన్ని గుర్తిస్తే.. వార్ అంటే ఊగిపోయే ధోరణి తగ్గటం ఖాయం.