Begin typing your search above and press return to search.

రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ... కరోనాపై రంగంలో అమ్మవారు ఏంచెప్పారంటే ?

By:  Tupaki Desk   |   13 July 2020 8:10 AM GMT
రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ...  కరోనాపై రంగంలో అమ్మవారు ఏంచెప్పారంటే ?
X
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టం అయినటువంటి రంగం... అత్యంత ఆసక్తిగా జరిగింది. పచ్చికొండ పై రంగం ఎక్కిన జోగిణి స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణిని వినిపించారు. ప్రతి ఏడాదిలానే వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? ప్రజలు ఎలా ఉంటారు అనే అంశాల్ని పూజారులు అడిగేవారు. అలాగే ప్రస్తుతం ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్న కరోనా మహమ్మారి గురించి కూడా అడిగారు. ఈ వైరస్ ఎన్నాళ్లు ఉంటుంది? ఎప్పుడు పోతుంది? ప్రజలు ఏం చెయ్యాలి? అని అడగ్గా అమ్మవారు కోపంతో ఊగిపోయి తీవ్రమైన హెచ్చరికలు చేసారు.

ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదు కదా అని తెలిపింది. ఓ అమ్మగా తాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నా... అంతకు మించి ప్రజలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రజలు కష్టాలు పడుతుంటే తాను సంతోషంగా ఎలా ఉంటాను అని తాను ప్రజలను కాపాడతానని అన్నారు. రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవన్న ఆమె... ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయండని , ప్రతి గడప నుంచి శాక, పప్పుబెల్లాలు రావాలన్నారు. కామంతో కాకుండా, భక్తిభావనతో చేసినట్టైతే , ప్రతి ఒక్కరిని తప్పక కాపాడతానన్నారు. అలాగే గంగా దేవికి యాగాలు జరపాలని సూచించారు.