Begin typing your search above and press return to search.

కరోనా భయంతో 19 ఏళ్ల అమ్మాయిని చంపేసిన బస్సు డ్రైవర్ !

By:  Tupaki Desk   |   11 July 2020 1:30 PM GMT
కరోనా భయంతో 19 ఏళ్ల అమ్మాయిని చంపేసిన బస్సు డ్రైవర్ !
X
కరోనా వైరస్ పుణ్యమా అని మనుషుల్లో ఇప్పటివరకు ఇంకా కొద్దో గొప్పో మానవత్వం ,మంచితనం రెండూ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోతున్నాయి. కరోనా భయంతో మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే సరిగ్గా తెలియడం లేదు. వైరస్ భారిన పడితే తాము కూడా చనిపోతామేమో అన్న భయం తో అసలు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణంగా ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. అతన్ని నుంచి దూరం వెళ్లడమే కాదు వారిని ఓ రోగిగా పరిగణిస్తున్నారు. ఇక కరోనాతో మరణించిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది.

కొన్ని కొన్ని కరోనా కారణంగా చనిపోయినవారి అంత్యక్రియలని జేసీబీల తో చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్డు పక్కన విసిరివేసి వెళ్తున్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో తమ గ్రామానికి చెందిన వారైనా కూడా కరోనా తో చనిపోతే వారి అంత్యక్రియలు ఊర్లో చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఆ భయంతోనే ఏకంగా ఓ యువతిని బస్సులోంచి తోసేయటంతో ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. యూపీకి చెందిన అన్షిక యాదవ్ అనే 19 ఏళ్ల యువతి జూన్ 15న తల్లితో కలిసి ఢిల్లీ నుంచి ఫిరోజాబాద్ జిల్లా శికోహాబాద్ వెళ్లటానికి నోయిడాలో బస్ ఎక్కింది. అయితే , బస్సు అక్కడి నుండి బయల్దేరిన కాసేపటి ఆ యువతికి కరోనా ఉందేమో అని ఆ బస్సులో ఉన్నవారితో పాటుగా బస్సు డ్రైవర్ , కండక్టర్ కూడా అనుమానం వ్యక్తం చేసారు. దీనితో ఆ అమ్మాయిని బస్సు దిగాలని చెప్పారు. అయితే , నేను ఎందుకు బస్సు దిగాలి. నాకు కరోనా లేదని ఆ యువతీ , అలాగే నా కూతురికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవని ఆమె తల్లి కూడా చెప్పింది. అయినా కూడా ఎవరు వినిపించుకోలేదు. అయితే , ఆ యువతిని బస్సులో నుండి దించేయాలని ప్రయాణికులు అందరూ ఆందోళన వ్యక్తం చేయడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ యువతిని బలవంతంగా కిందకి దింపే ప్రయత్నం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో కిందకు తోసేశారు. దానితో రోడ్డుపై పడిపోయిన యువతికి బాగా దెబ్బలు తగిలాయి ..అలానే ప్రాణాలతో అరగంట పాటు కొట్టుమిట్టాడి ఆ తర్వాత మృతిచెందింది. ఢిల్లీ-యూపీ యమునా ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ జోక్యం చేసుకుని దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మథుర ఎస్‌ఎస్పీ గౌరవ్ గ్రోవర్‌ను కోరింది