Begin typing your search above and press return to search.

కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఇద్దర్ని దారుణ హత్య.. ఎలా చేశారంటే

By:  Tupaki Desk   |   17 Jun 2021 5:30 AM GMT
కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఇద్దర్ని దారుణ హత్య.. ఎలా చేశారంటే
X
పగలు.. ప్రతీకారాలకు.. ఫ్యాక్షన్ హత్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది కర్నూలు జిల్లా. దాదాపు పాతికేళ్ల క్రితంతో పోలిస్తే.. ఇప్పుడు ఫ్యాక్షన్ తో పాటు.. హత్యలు బాగానే తగ్గాయి. అయితే.. అప్పుడప్పుడు పాత కక్షలు తెర మీదకు వస్తుంటాయి. హత్యల రూపంలో దారుణాలు చోటు చేసుకుంటాయి. తాజాగా కర్నూలు జిల్లాలో మరో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఈ దారుణంలో ఇద్దరు టీడీపీ నేతలు (చిన్నస్థాయి) హత్యకు గురయ్యారు.

ఈ హత్యలన్ని పాత కక్షలతోనే చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని పెసరవాయికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల్ని వారి ప్రత్యర్థులు దారణంగా హత్య చేశారు. మరణించిన వారిలో మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వర్ రెడ్డి.. అతని తమ్ముడు వ్యవసాయ సహకారం సంగం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ టీడీపీకి చెందిన వారని చెబుతున్నారు.

అయితే.. కర్నూలు జిల్లాలో శత్రువుల్ని చంపేసేందుకు ఒకే విధానాన్ని అమలు చేస్తుంటారు. తాము టార్గెట్ చేసిన వారిని ఏదో ఒక వాహనంతో ఢీ కొడతారు.అనంతరం బాంబులు వేస్తారు. ఆ తర్వాత కత్తులు.. కొడవళ్లతో వారిని దారుణంగా నరికేస్తారు. కొన్ని సందర్భాల్లో బాంబుల్ని వినియోగించరు. గురువారం ఉదయం చోటు చేసుకున్న హత్యల్లో శ్మశానికి వెళుతున్న అన్నదమ్ములు ఇద్దరిని బొలేరా వాహనాలతో ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం గాయపడిన వారిద్దరిని వేటకొడవళ్లతో నరికి చంపినట్లుగా చెబుతున్నారు.

మూడు రోజుల క్రితం మరణించిన వారి బంధువులు చనిపోయారు. వారికి సంప్రదాయంలో భాగంగా శశ్మానానికి వెళ్లి పూజ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో వారు వెళుతుండగా.. ప్రత్యర్థులు దారి కాచి వారిపై దాడి చేసి చంపేశారు. ప్రత్యర్థుల దాడితో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కర్నూలు హత్యల చరిత్రలో మరో కోణం ఉంది. వారు టార్గెట్ చేసిన వారిని తప్పించి.. మిగిలిన వారిని గాయపరుస్తారు కానీ.. వారిని మాత్రం హత్యలు చేయరు. అదే సమయంలో మహిళలకు.. పిల్లలకు కించిత్ హాని కలిగించరు. కాలం మారినా.. కర్నూలు జిల్లాలోని వారి పగలు.. ప్రతీకారాలు మాత్రం మారని దుస్థితి.