Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. తెరపైకి మరో వ్యక్తి

By:  Tupaki Desk   |   29 Nov 2021 4:18 PM GMT
వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. తెరపైకి మరో వ్యక్తి
X
ఏపీ వ్యాప్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య వివాదానికి కారణమై సంచలనం సృష్టించిన ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో భారీ ట్విస్ట్ నెలకొంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించడం కలకలం రేపింది.

రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డిలు నాతో వివేకా హత్య చేయించినట్లు చెప్పాలంటూ వైఎస్ వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు నన్ను వేధిస్తున్నారంటూ గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనమైంది.

వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు మరికొందరినీ ఈ కేసులో ఇరికించేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని అనంతపురం జిల్లా యాడికికి చెందిన గంగాధర్ రెడ్డి జిల్లా ఎస్పీ ఫకీర్పకు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకా కూతురు సునీతతో పాటు మరికొందరు అనుచరులు తనను బెదిరిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇందుకు తను ఒప్పుకోకపోవడంతో డబ్బు కూడా ఇస్తామని చెప్పారని గంగాధర్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.తనతోపాటు కుటుంబ సభ్యులకు ప్రాణ రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

గంగాధర్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ ఫకీరప్ప.. దర్యాప్తు చేస్తున్నామని విచారణ అధికారిగా డీఎస్పీని నియమించినట్లు తెలిపారు. వారం రోజుల్లో విచారణ పూర్తవుతుందని వెల్లడించారు. దీంతో పాటు గంగాధర్ తోపాటు అతడి కుటుంబానికి రక్షణ కల్పించినట్టు పేర్కొన్నారు.