Begin typing your search above and press return to search.

తోట త్రిమూర్తులు చేరిక.. వైసీపీకి నష్టమేనా?

By:  Tupaki Desk   |   16 Sep 2019 7:28 AM GMT
తోట త్రిమూర్తులు చేరిక.. వైసీపీకి నష్టమేనా?
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తోట త్రిమూర్తులకు ఆ పార్టీ రెడ్ కార్పేట్ వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ లాంఛనం అయితే పూర్తి అయ్యింది కానీ, త్రిమూర్తులు చేరికతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం ఏమిటి? అనేది ప్రశ్నార్థకమే.

అప్పుడు అధికార పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన ఇలాంటి వాళ్లను చేర్చుకోవడం ఎందుకో అనే చర్చ జరుగుతూ ఉంది. ఇలా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వచ్చిన వారు ఊరికే రారు. అధికార పార్టీలో ఉంటూ ఏదో లబ్ధి పొందాలనే లెక్కలతోనే వాళ్ల చేరికలు సాగుతాయి. అలాంటి చేరికల్లో ఇదీ ఒకటి.

అధికారం చేతిలో లేకపోవడంతో అల్లాడిపోతున్నట్టుగా తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలా అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు చేరే నేతల వల్ల ఉపయోగం కూడా ఏ పార్టీకి ఉండదు. తోట త్రిమూర్తులు చరిత్రను చూస్తే ఆయన ఎప్పుడు ఏ పార్టీ చేతిలో అధికారం ఉంటే ఆ పార్టీలోనే ఉన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తోట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అధికార పార్టీ నేత అయిపోయారు.

కేవలం తెలుగుదేశం పార్టీకి ఒక నేతను దూరం చేశామని అనడానికే ఈ చేరిక ఉపయోగపడుతుంది తప్ప, అంతకు మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈయన వల్ల ఉపయోగడం ఉండదనే విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి.