Begin typing your search above and press return to search.

వైసీసీ మంత్రి.. ఎమ్మెల్యేల మధ్య ‘ఇసుక’ తుఫాను!?

By:  Tupaki Desk   |   29 July 2021 10:04 AM GMT
వైసీసీ మంత్రి.. ఎమ్మెల్యేల మధ్య ‘ఇసుక’ తుఫాను!?
X
రాజకీయాలన్నాక విమర్శలు.. ఆరోపణలు.. తిట్లు.. తీర్మానాలు ఇవన్నీ చాలా కామన్. అయితే.. ఒక పార్టీకి చెందిన నేతలు మరో పార్టీకి చెందిన నేతల మధ్యన చోటు చేసుకుంటుంటాయి. అందుకు భిన్నంగా ఒకేపార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య నడిచే లడాయితో పార్టీకి కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కలిసి కట్టుగా ప్రత్యర్థులపై పోరాడాల్సింది పోయి.. సొంత నేతల మధ్యనే గొడవలైతే ప్రజల్లో ఇట్టే చులకన అయిపోతారు. తాజాగా ఏపీ అధికారపక్షంలో ఇలాంటి సిత్రమైన సీన్ ఒకటి నడుస్తోంది.

ఏపీలో విపక్షాలు బలహీనం కావటం.. కాస్తంత బలంగా ఉన్న నేతలంతా వైసీపీలోకి వచ్చేయటంతో.. ఇప్పుడా పార్టీ మొత్తం కిక్కిరిసిపోయింది. ఎక్కువైన నేతల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. ఏపీ అధికారపక్షానికి సంబంధించిన చాలానే జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల మాత్రం శ్రుతిమించి రాగాన పడుతోంది. ఇలాంటి నేతలపై చర్యల కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.

నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మంత్రి అనిల్ కుమార్ ఒకవైపు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు కమ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ మధ్య ఈ మధ్యన ఇసుక రచ్చ అంతకంతకూ ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు గుట్టుగా ఉన్న మనస్పర్థలు ఈ మధ్యన ఎక్కువ కావటమే కాదు.. రోడ్డున పడే పరిస్థితి ఉందంటున్నారు.అదే జరిగితే ప్రత్యర్థులకు అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. అంతే కాదు.. ప్రజల్లో చులకన అవుతున్నారన్న మాట వినిపిస్తోంది.

ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలన్ని ఇసుక చుట్టూనే తిరుగుతుండటం గమనార్హం. ఇసుక తినేస్తున్నారని ఒకరు.. ఇసుకను దోచేస్తున్నారని మరొకరు విమర్శలు చేసుకోవటం.. ఈ ఘాటు వ్యాఖ్యలన్ని సొంత పార్టీకి చెందిన నేతల మీదనే కావటంతో కార్యకర్తలు విస్తుపోతున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమంగా మట్టి తవ్వకాలు.. నెల్లూరు శివార్లలోని పెన్నానదిలో ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం మంత్రి వర్సస్ ఎమ్మెల్యే అన్నట్లుగా ఉంది.

గడిచిన రెండేళ్లుగా అనిల్.. సర్వేపల్లి మధ్యన విభేదాలు నడుస్తున్నాయని.. ఈ మధ్యన ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ లో మట్టి తవ్వకాలకు అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలకు ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వటంతో.. 8 వేల క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకాల్ని అనుమతిస్తూ సినరీ సెజ్ కట్టించుకున్నారు.

మరి వివాదం ఏమంటే.. ఇచ్చిన అనుమతులకు మించి మట్టితవ్వకాలు జరిగాయన్నది ఆరోపణ. రూల్స్ కు భిన్నంగా రాత్రి వేళల్లో కూడా మట్టిని తరలిస్తున్నారంటూ కొన్ని ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో రావటంతో ఇబ్బందికరంగామారింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మంత్రిఅనిల్ ఆదేశించారు. తనకు చెందిన అంశంలో మంత్రి అనిల్ ఎంటర్ కావటంతో.. తాను మాత్రం తక్కువ తినలేదన్నట్లు కాకాని సైతం మరో ఇష్యూను తెర మీదకు తెచ్చినట్లుగా చెబుతున్నారు.

మంత్రి అనిల్ కు చెందిన పెన్నాలో ఇసుక తవ్వకాలు అక్రమంగా సాగుతున్న విషయాన్ని అధికారులకు కంప్లైంట్ చేశారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం సాగుతుందని చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడటమే కాదు.. పార్టీకి సమస్యగా మారటం ఖాయమంటున్నారు. ఈ రచ్చ మీద సీఎం కమ్ పార్టీ అధినేత ఒక చూపు చూస్తే లెక్కలు మొత్తం సెట్ అవుతాయన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ ఈ వ్యవహారాన్ని ‘‘చూస్తున్నారా’’?