Begin typing your search above and press return to search.

రాత్రి మందు తాగి.. పగలు ప్రజల్ని కొట్టడం.. బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   7 March 2021 4:21 AM GMT
రాత్రి మందు తాగి.. పగలు ప్రజల్ని కొట్టడం..  బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు
X
దగ్గరకు వస్తే ఆత్మీయంగా పలుకరిస్తారు. సెల్ఫీ తీసుకోవాలన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే.. పక్కకు తీసుకొని వారి చిరు కోరికను తీర్చి పంపుతారు. షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉబలాటపడితే వారి ముచ్చట తీర్చేస్తారు. నేత ఎవరైనా సరే.. తన అభిమాని విషయంలో ఇదే తరహాలో వ్యవహరిస్తారు. సెలబ్రిటీలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ప్రముఖ నేత.. సెలబ్రిటీ తన అభిమానుల్ని ఈసడించుకోవటం.. విరుచుకుపడటం.. వారి మీద చేయి చేసుకోవటం.. బూతులు లంకించుకోవటం లాంటివి విని ఉండం. కానీ.. ఇందుకు మినహాయింపుగా ప్రముఖ నటుడు కమ్ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణను చెప్పాలి.

ఎప్పుడు.. ఎలా వ్యవహరిస్తారన్న విషయాన్ని ఆయన సన్నిహితులు కూడా అంచనా వేయలేని విచిత్రమైన మనస్తత్వం ఆయన సొంతమని చెబుతారు. ఆయన్ను విపరీతంగా అభిమానించి.. ఆరాధించే వారి విషయంలో ఆయన వ్యవహరించే తీరు తరచూ వివాదానికి తెర తీయటమే కాదు.. సంచలనంగా మారుతుంది. తనను అభిమానించి.. తనను చూస్తే చాలు.. తనను తాకితే చాలు తమ జీవితం ధన్యమైపోతుందని భావించే వీరాభిమానుల విషయంలో విరుచుకుపడుతుంటారు. వారిని ఈసడించుకుంటారు. తాజాగా మరోసారి అలాంటి తీరునే ప్రదర్శించి విమర్శలకు అవకాశం ఇచ్చారు.

తనను విపరీతంగా అభిమానించే అభిమానులు.. అంతకు మించిన ఆరాధకుల విషయంలో ఆయన మరోసారి దారుణంగా వ్యవహరించి వార్తల్లోకి వచ్చారు. దీనిపై తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా ఖండించారు. పుర ఎన్నికల్లో భాగంగా వైసీపీ అభ్యర్థి ప్రచారాన్ని నిర్వహించిన ఆయన బాలయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ‘రాత్రి మందు తాగడం.. పగలు ప్రజలను కొట్టడం ఎమ్మెల్యే బాలకృష్ణకు మామూలే’’ అని మండిపడ్డారు. ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించాలా? అని ప్రశ్నించారు. గతంలోనూ అభిమానులపై బాలకృష్ణ చేయి చేసుకున్నప్పటికి.. ఈ స్థాయిలో విమర్శల్ని మాత్రం ఎదుర్కోలేదు. తనపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు బాలయ్య ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి. అయితే.. బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న వారంతా తర్వాత కూడా ఆయన మీద అభిమానాన్ని ప్రదర్శించటం మొత్తం ఎపిసోడ్ లో విచిత్రమైనదిగా చెప్పక తప్పదు.