Begin typing your search above and press return to search.

ఈసారి ఐపీఎల్ ట్రోఫి చెన్నైదే.. అదగొట్టిన ధోనీ సేన

By:  Tupaki Desk   |   16 Oct 2021 3:31 AM GMT
ఈసారి ఐపీఎల్ ట్రోఫి చెన్నైదే.. అదగొట్టిన ధోనీ సేన
X
రెండు దశలుగా జరిగిన ఈసారి ఐపీఎల్ టోర్నీ.. ఎట్టకేలకు ముగిసింది. టీ20 వరల్డ్ కప్ కు రెండు రోజుల ముందు ముగిసిన ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. తన ప్రత్యర్థి కోల్ కతా మీద ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. తొమ్మిదేళ్ల క్రితం ఐపీఎల్ ఫైనల్ లో ఆ జట్టు చేతిలో ఓడిన చెన్నై.. తాజా గెలుపుతో ఆ ఓటమిని సమం చేసిందని చెప్పాలి. దసరా పర్వదినాన జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం నేపథ్యంలో చెన్నై ఈసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో చెన్నై జట్టుది నాలుగో విజయం కావటం విశేషం.

మ్యాచ్ విషయానికి వస్తే.. చైన్నై జట్టు అటు బ్యాటింగ్ లోనూ.. ఇటు బౌలింగ్ లోనూ తన అధిక్యతను స్పష్టంగా ప్రదర్శించింది. తమ అద్భుతమైన బ్యాటింగ్ తో మ్యాచ్ ప్రారంభించిన చెన్నై జట్టు నిర్ణీత 20ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ కు ఇచ్చింది. తమ బ్యాటింగ్ షురూ చేసిన కోల్ కతా ఓపెనర్లు అద్భుతంగా రాణించటంతో.. ఒక దశలో ఆ జట్టు విజేతగా నిలవటం ఖాయమన్న భావన కలిగింది.

అయితే.. అనూహ్యంగా వరుస వికెట్లను కోల్పోయిన కోల్ కతా.. తీవ్ర ఒత్తిడికి లోనై చేతులు ఎత్తేయటంతో విజయం చెన్నైను వరించింది. దీంతో.. నాలుగోసారి చెన్నై జట్టు ఐపీఎల్ విజేతగా అవతరించింది. అంతేకాదు.. తొమ్మిదేళ్ల క్రితం 2012లో జరిగిన ఫైనల్ లో ఇదే జట్టుతో ఎదురైన ఓటమిని సరి చేసినట్లైంది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన చెన్నై జట్టు ఆరంభం అదిరేలా చేసింది. ఓపెనర్లు రుతురాజ్ (32).. ఫాష్ డుప్లెసిస్ (86) బలమైన పునాదులు వేయటంతో మొదటి ఆరు ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది.

61 పరుగల వద్ద మొదటి వికెట్ ను చెన్నై జట్టు కోల్పోయింది. తొమ్మిదో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాక.. క్రీజ్ లోకి వచ్చిన రాబిన్ ఊతప్ప (31) సాధించాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే చెలరేగిన ఇతడు.. స్కోర్ వేగాన్ని పెంచాడే కానీ తగ్గించలేదు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. వీరిద్దరు రెండో వికెట్ కు 63 పరుగులు జోడించారు. పరుగుల జోరు పెంచే క్రమంలో రాబిన్ ఊతప్ప అవుట్ కాగా.. అతడి స్థానంలో వచ్చిన మొయిన్ అలీ తాను ఎదుర్కొన్న 20 బంతుల్లో రెండు ఫోర్లు.. మూడు సిక్సర్లతో 37 పరుగుల్ని వేగంగా తీశాడు.

మొయిన్ అలీ.. డుప్లెసిస్ లు కలిసి మూడో వికెట్ కు 68 పరుగులు చేయగా.. 20వ ఓవర్ చివరి బంతికి డుప్లెసిస్ అవుట్ కావటంతో..మూడు వికెట్ల నష్టానికి 192 పరుగుల్ని చేసింది చెన్నై జట్టు. అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్ కతా జట్టు.. తమ ప్రారంభ ఓవర్లలో అదరగొట్టేసింది. ఓపెనర్లు అద్భుతమైన ఫాంలో ఉండటంతో శుభమన్ గిల్ 43 బంతుల్లో 51 పరుగులు చేయగా.. వెంకటేశ్ అయ్యర్ 32 బంతుల్లో 50 పరుగులు చేశారు.

నిజానికి వెంకటేశ్ అయ్యర్ వ్యక్తిగత స్కోర్ ఏమీ లేనప్పుడు అతను ఇచ్చిన క్యాచ్ ను ధోని వదిలేసి ఉంటే.. కోల్ కతా జట్టు ఇంత స్కోర్ కూడా చేసి ఉండేది కాదు. పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 88 పరుగులు చేస్తే.. అందులో వెంకటేశ్ వ్యక్తిగత స్కోర్ 50 పరుగులు ఉండటం గమనార్హం. దీంతో ఈసారి చెన్నై జట్టు మీద కోల్ కతా జట్టు అధిక్యతను ప్రదర్శిస్తుందని.. మరోసారి విజేతగా నిలుస్తుందన్న భావనకు గురయ్యేలా చేశారు.

అనూహ్యంగా పదకొండో ఓవర్ నుంచి మ్యాచ్ మొత్తం మారిపోయింది. 11వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీసుకోవటంతో మ్యాచ్ సీన్ మొత్తం మారిపోయింది. ఆ వెంటనే కోల్ కతా జట్టు ఒత్తిడికి గురైంది. 12వ ఓవర్లో సునీల్ నరైన్ వికెట్.. 14వ ఓవర్లో శుభ్ మన్ గిల్ అవుట్ కావటం.. పదిహేనో ఓవర్లో జడేజా వేసి ఓవర్లో.. వరుస బంతుల్లో దినేష్ కార్తీక్.. షకీబ్ అల్ హసన్ లు ఔట్ కావటంతో కోలో కతా జట్టు తీవ్ర ఒత్తిడికి గురైంది. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు సైతం చైన్నై బౌలర్లకు తమ వికెట్లను సమర్పించుకోవటంతో కచ్ఛితంగా గెలుపు ఖాయమన్న మ్యాచ్ లో ఓడిపోయిన పరిస్థితి. దీంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగుల్ని మాత్రమే చేసిన కోల్ కతా జట్టు ఓటమి పాలైతే.. విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. అభిమానలు ఆశలు పెట్టుకున్న ధోనీ సేన ఇరగదీసింది.