Begin typing your search above and press return to search.

రావణకాష్టంగా బెంగళూరు... అసలు కథ ఇదే

By:  Tupaki Desk   |   12 Aug 2020 5:35 PM GMT
రావణకాష్టంగా బెంగళూరు... అసలు కథ ఇదే
X
ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో మంగళవారం రాత్రి ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన పోస్టుల వివాదం.. చివరకు నగరాన్ని రావణకాష్టంగా మార్చేసింది. ఈ అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా... మరో వ్యక్తితో పాటు పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నానికే ఈ గొడవలు సద్దుమణిగినా.. అసలు ఈ గొడవ ఎలా మొదలైంది? ముందుగా వివాదాన్ని రేపింది ఎవరు? ఆ వివాదానికి స్పందించి ఆజ్యం పోసింది ఎవరు? అన్న విషయంపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భీకర చర్చ నడుస్తోంది.

ప్రాథమిక వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి అల్లుడు నవీన్… ఓ వర్గం ఆరాధ్య దైవం మొహమ్మద్ ప్రవక్తను రేపిస్ట్ గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడితే.. దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు వర్గానికి చెందిన వ్యక్తులు నగరంలోని బీజే హళ్లిలో నానా బీభత్సం సృష్టించారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ ను అరెస్ట్ చేసి.. అల్లర్లను సద్దుమణిగేలా చర్యలు చేపట్టినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఏకంగా కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా... ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అల్లర్లకు దిగిన వర్గం తమను అదుపు చేయడానికి వచ్చిన పోలీసులతో పాటు ఓ పోలీస్ స్టేషన్ పైనా ప్రతాపం చూపారు. నవీన్ ను టార్గెట్ గా చేసుకుని ఎమ్మెల్యే ఇంటిపైకీ దండెత్తారు. అక్కడ పెను బీభత్సం సృష్టించారు.

అయితే నవీన్ అరెస్టయ్యేదాకా అతడే ఈ గొడవకు మూల కారకుడని అంతా భావించినా... ఆ తర్వాత అసలు విషయలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ వివాదానికి తెర తీసింది అల్లర్లకు దిగిన వర్గానికి చెందిన వారేనని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు రేపిస్ట్ అని ఓ వర్గానికి చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారట. దీనిని చూసిన నవీన్… దానికి ప్రతిస్పందనగా… మొహమ్మద్ ప్రవక్త కూడా 9 ఏళ్ల బాలికను రేప్ చేశారంటూ తనదైన శైలిలో ఓ ఫొటోెతో కలిపి పోస్ట్ పెట్టాడు. తొలి వర్గం పెట్టిన పోస్ట్ అంతగా బయటకు రాకున్నా… నవీన్ పెట్టిన పోస్ట్ మాత్రం బెంగళూరు రావణ కాష్టంగా మారడానికి కారణమైందని నెటిజన్లు దాదాపుగా తేల్చేశారు. తొలి వర్గానికి చెందిన వారు హిందూ దేవతలను దూషిస్తూ పోస్ట్ పెడితే… దానిపై పోలీసులు ఫిర్యాదు చేయడానికి బదులుగా నవీన్ తాను కూడా వారి బాటలోనే ఆలోచించి మొహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా పోస్ట్ పెట్టడం సరికాదన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే... మొహమ్మద్ ప్రవక్తపై పోస్ట్ పెట్టినందుకు నవీన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు… అసలు ఈ మొత్తం వివాదానికి కారణమైన పోస్ట్ ను పెట్టిన తొలి వర్గానికి చెందిన వ్యక్తులను మాత్రం అరెస్ట్ చేయకపోవడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా నవీన్ పోస్ట్ ను వారేమీ సమర్థించడం కూడా లేదు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, అయితే కేవలం నవీన్ ను మాత్రం అరెస్ట్ చేసిన పోలీసులు… తొలి వర్గానికి చెందిన వ్యక్తుల గురించి పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన రెండు పోస్టుల కారణంగా ఇప్పుడు బెంగళూరు రణరంగంగా మారిపోయింది. అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం… ఈ మొత్తం వ్యవహారంపై తనదైన శైలి విచారణకు శ్రీకారం చుట్టింది. వివాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై…జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే కక్కిస్తామని సంచలన ప్రకటన చేశారు.