Begin typing your search above and press return to search.

ఈ ఫోటో ఒక్కటి చాలు కేసీఆర్ తప్పుల్ని లైట్ తీసుకోవచ్చు

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:45 AM GMT
ఈ ఫోటో ఒక్కటి చాలు కేసీఆర్ తప్పుల్ని లైట్ తీసుకోవచ్చు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రాష్ట్ర ప్రజలు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. చైతన్యానికి నిలువెత్తు రూపమైన తెలంగాణ ప్రజలు తప్పుల్ని అదే పనిగా చూస్తూ ఉండిపోరు. ఎప్పటికప్పుడు నిలదీస్తుంటారు. అయితే.. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకునే విపక్షాలు.. వాతావరణం తమకు అనుకూలంగా మారిందని భావిస్తారు. అయితే.. ఇలాంటి ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో కేసీఆర్ ప్రదర్శించే చతురత అంతా ఇంతా కాదు.

ఈ కారణమే.. కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పాలపొంగు లాంటిదని అభివర్ణిస్తుంటారు. ఎన్నికల వరకు ప్రజలు కేసీఆర్ ను తిట్టొచ్చు. కానీ.. ఒకసారి షెడ్యూల్ విడుదలైతే చాలు.. వారిని ప్రసన్నం చేసుకోవటమే కాదు.. వారి మనసుల్లో.. ఈసారికి కారుకే ఓటేద్దామన్న భావన కలిగించటంలో ఆయన సక్సెస్ అవుతుంటారు. అదే ఆయనకున్న బలంగా చెప్పాలి. ఇంతకీ అంతలా మేజిక్ ఏం చేస్తారు? అన్నది ప్రశ్న.

దీనికి సమాధానంగా ఈ రోజు మీడియాలో పబ్లిష్ అయిన ఒక ఫోటో చూస్తే.. కేసీఆర్ తప్పుల్ని తెలంగాణ ప్రజలు ఎందుకంత లైట్ తీసుకుంటారనే దానికి.. ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంతో కేసీఆర్ అనుసరించిన పద్దతిగా చెప్పాలి. విభజన వరకు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఊళ్లలో నీళ్లు చూస్తే పండుగలా ఫీల్ అవుతారు. తెలంగాణకు చెందిన వారు ఏపీకి వెళ్లి.. అందునా కోస్తా ప్రాంతానికి వెళ్లినప్పుడు.. రోడ్డు పక్కనే పోయే కాలువల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇన్నినీళ్లా అని ఆశ్చర్యపోతారు. గడిచిన మూడేళ్లలో అలాంటి ఆశ్చర్యం బాగానే తగ్గింది. కారణం.. ప్రాజెక్టులు.. మిషన్ భగీరధ పుణ్యమేనని చెప్పాలి.

ఇక.. ఇవాళ పబ్లిష్ అయిన ఫోటోను చూస్తే.. తెలంగాణ ప్రజల కడుపు నిండిపోవటం ఖాయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కాళేశ్వరంలోని లక్ష్మీ బ్యారేజీ నుంచి (కన్నెపల్లి పంప్ హౌస్) నీటి ఎత్తిపోస్తున్నారు. ఈ కమనీయమైన దృశ్యం కళ్ల ముందు కదలాడేలా చేసింది.

లక్ష్మీ బ్యారేజీ నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం జలాశయాల మీదుగా బుధవారం సాయంత్రానికి మిడ్ మానేరుకు మొత్తం 30 పంపుల ద్వారా నీటిని తరలిస్తున్న అత్యద్భుతమైన సీన్ అద్భుతంగా ఇలా ఆవిష్కృతమైంది. తెలంగాణలోని ప్రాజెక్టులను నీటి కుండలా సిద్ధం చేస్తున్న వైనం నీటి కోసం తండ్లాడిన తెలంగాణ బిడ్డలకు కడుపు నిండకుండా ఉంటుందా? కేసీఆర్ తప్పుల్ని లైట్ తీసుకుందామని అనిపించకుండా ఉంటుందా? తెలంగాణ ప్రజలకు ఏమిస్తే.. తనను నెత్తిన పెట్టుకుంటారో తెలిసిన కేసీఆర్ జాదూతనమే ఆయనకు శ్రీరామరక్షగా చెప్పక తప్పదు.