Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా తొలి కేసు రాష్ట్రంలో థర్డ్ వేవ్ షురూ

By:  Tupaki Desk   |   30 July 2021 4:42 AM GMT
దేశంలో కరోనా తొలి కేసు రాష్ట్రంలో థర్డ్ వేవ్ షురూ
X
అక్కడెక్కడో చైనాలోని వూహాన్ మహానగరంలో పుట్టి.. ప్రపంచానికి చావు తెచ్చిన కొవిడ్.. భారత్ లో తొలి కేసు నమోదైంది మాత్రం కేరళ రాష్ట్రంలోనే. అది మొదలు కరోనా కేసులు ఎంత ఎక్కువగా నమోదయ్యాయో.. ఎన్ని విషాదాలకు అది తెర తీసిందో తెలిసిందే. మొదటి వేవ్ తిప్పలు పెట్టినా.. సెకండ్ వేవ్ మాత్రం భారీ షాకిచ్చింది. ఇటీవల కాలంలో దేశం ఎప్పుడూ చూడని దారుణాలకు.. విషాద సన్నివేశాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కేసులు తీవ్రమై.. ఆసుపత్రులకు పోటెత్తటం.. బెడ్ల కోసం చేసిన ప్రయత్నాలు.. కళ్ల ముందు చనిపోతున్నా ఏమీ చేయలేని దుస్థితి.. అంబులెన్సులు బారులు తీరటం లాంటివెన్నో ఘటనలు ఆవిష్క్రతమయ్యాయి.

థర్డ్ వేవ్ బూచికి సంబంధించి వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న దాఖలాలు లేవు. దేశంలో పక్కాగా కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ.. మహమ్మారి వ్యాప్తికి చెక్ పెడుతున్నారన్న పేరున్న కేరళలో.. తాజాగా థర్డ్ వేవ్ కనిపిస్తుండటం.. గడిచిన కొద్దిరోజులుగా కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న వైనం ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య కేరళ ప్రభుత్వాన్నే కాదు.. కేంద్రాన్ని కూడా కలవరానికి గురి చేస్తోంది. ఒక నిపుణుల టీంను కేరళకు పంపి పరిస్థితిని అధ్యయనం చేయాలని ఆదేశించింది.

సమర్థవంతంగా కట్టడి చేస్తున్నారన్న రాష్ట్రంలో థర్డ్ వేవ్ షురూ కావటం.. ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాకేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ కావటం వెనుక అసలు కారణం ఏమిటన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేరళలో కేసులు పెరగటానికి కారణాన్ని సీరో సర్వే ఫలితం కొత్త కోణాన్ని చూపించింది. దేశంలో అత్యంత తక్కువ యాంటీ బాడీలు ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఆ రాష్ట్రంలో యాంటీబాడీలు కేవలం 44 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేరళలో 56 శాతం మందికి కొవిడ్ ముప్పు ఉన్నట్లుగా చెప్పకతప్పదు. ఈ కారణంగానే కేరళ చుట్టుపక్కల రాష్ట్రాలతో పోలిస్తే.. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. తమిళనాడులో జూన్ ఆరున రోజుకు 20వేల పైచిలుకు కేసులు ఉంటే.. జులై 27 నాడు 1767 కేసులకే పరిమితమైంది. కర్ణాటకలోనూ కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఇందుకు భిన్నంగా కేరళలో మాత్రం కేసులు ఎక్కువ అవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో పోలిస్తే.. కేరళలోనే అత్యధికకేసులు నమోదవుతున్నాయి. జులై 27నదేశంలో కొత్తగా 43 వేల కేసులు నమోదైతే.. ఒక్క కేరళలో 22 వేల కేసులు నమోదు కావటం చూస్తే.. ఆ రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. దేశంలో థర్డ్ వేవ్ కు కేరళ హాట్ స్పాట్ గా ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే నమోదవుతున్న పరిస్థితి. దీంతో.. అక్కడ మరింత కఠినంగా లాక్ డౌన్ విధిస్తున్నారు.