Begin typing your search above and press return to search.

డబ్బు ఆశ.. వీళ్లని పిచ్చివాళ్లని చేసింది.

By:  Tupaki Desk   |   25 Aug 2019 1:30 AM GMT
డబ్బు ఆశ.. వీళ్లని పిచ్చివాళ్లని చేసింది.
X
డబ్బు మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఊరికే ఉన్న ఫలంగా డబ్బు వస్తుందంటే ఎవరూ పనిచేయరు.. ఆ డబ్బు డబుల్ అవుతుందంటే ఆశగా వెళుతారు. ఇలా డబ్బుపై అత్యాశ ఉన్నవారిని గమనించి ఉన్నది ఊడ్చుకొని మోసం చేస్తుంటారు కొందరు మోసగాళ్లు. ఇప్పుడు హైదరాబాద్ లో రెండు వరుస సంఘటనల్లో ఇలాంటి మోసాలే బయటపడడం విశేషం.

*పాతనోట్లతో పెట్రోల్ బంక్ యజమానికి టోకరా..
హైదరాబాద్ లోని పుత్లిబౌలిలోని సంతోషి పెట్రోల్ బంక్ యజమాని రాజ్ కుమార్ బగాడియాకు డబ్బు ఆశ ఎక్కువ. దీన్ని ఆ బంక్ లో పనిచేసే రాజేశ్ పసిగట్టాడు. తన ఇద్దరు మిత్రులు బండ్లగూడకు చెందిన అబేద్- తలాబ్ కట్టకు చెందిన షేక్ అబ్బుదల్ బాసిత్ కు చెప్పాడు. ఈ ముగ్గురు కలిసి పెట్రోల్ బంక్ యజమానికి టోకరా వేయాలని యోచించారు. మోడీ ప్రభుత్వం రద్దు చేసిన పాతనోట్లలోని ఓ సిరీస్ నోటు రూ.500 ఇస్తే రూ.50వేలు ఇవ్వడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని పెట్రోల్ బంక్ యజమాని బగాడియాను నమ్మించారు. ఆ పాత 500 నోట్లు ఎక్కడున్నాయో కూడా చెప్పారు. తేలిగ్గా డబుల్ డబ్బు వస్తుందని చెప్పడంతో బగాడియా ఆశపడ్డాడు. 12 లక్షలు ఇచ్చి రూ.2కోట్ల పాత కరెన్సీ తెమ్మని పంపాడు. వారు మోసం చేసి ఉడాయించారు. రెండు మూడు రోజులు ఎదురుచూసిన బగాడియా డబ్బులు రాక.. తీసుకుపోయిన వారు రాకపోవడంతో చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ ముగ్గురి బండారం బయటపెట్టి అరెస్ట్ చేసి రికవరీ చేశారు.

*బాబాను నమ్మి 12 లక్షలు మునిగిన డ్రైవర్
హైదరాబాద్ ఎల్ ఎన్ నగర్ కు చెందిన డ్రైవర్ బండారు రత్నయ్యను కూడా ఇలానే మోసం చేశారు.. ఇతడి స్నేహితుడు జాఫర్ మరో వ్యక్తి ప్రభాకర్ తో కలిసి మహారాష్ట్ర బాబా ఉన్నాడని అతడికి 12 లక్షలు ఇస్తే మూడు రెట్లు 36 లక్షలు చేసి ఇస్తాడని నమ్మించారు. దీంతో డ్రైవర్ రత్తయ్య ఎలాగోలా కష్టపడి విడతల వారీగా 12 లక్షలు ఇచ్చాడు. అవి తీసుకొని ఒక బ్యాగ్ ను మహారాష్ట్ర బాబా మౌలాలా మహ్మద్ ఇర్ఫాన్ ఇచ్చాడు. 15 రోజులు పూజలు చేసి దాన్ని విప్పితే 36 లక్షలు వస్తాయని వెళ్లిపోయాడు. వాళ్లు 15రోజులు పూజలు చేసి బ్యాగులు తెరువగా.. రత్తయ్య దంపతులు షాక్ తిన్నారు. అందులో తెలుపు- నలుపు పేపర్ బెండిళ్లు ఉన్నాయి. బాబాకు ఫోన్ చేసి విషయం చెప్పగా మరో 60వేలు తీసుకొని మహారాష్ట్ర వస్తే వాటిని కరెన్సీ నోట్లు చేస్తానని.. మీ పూజలో లోపంతోనే ఇలా అయ్యిందని నమ్మించాడు. అలా 60వేలు తీసుకొని రత్తయ్య దంపతులు మహారాష్ట్రకు వెళ్లి బాబాకు డబ్బు ఇచ్చారు. ఇప్పుడే వస్తానని చెప్పి బాబా ఉడాయించాడు.

మోసపోయానని గ్రహించిన రత్తయ్య చివరకు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు నకిలీ బాబాతోపాటు జాఫర్- ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు.

ఇలా హైదరాబాద్ కేంద్రంగా డబ్బు అత్యాశతో ఇద్దరు మోసపోయిన వైనం వెలుగుచూసింది. ఉన్నది పొగొట్టుకొని పోలీస్ స్టేషన్ గడుపతొక్కారు