Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ గురించి వారి అంచనాలు నిజమే .. ఇక ముందు కూడా ?

By:  Tupaki Desk   |   10 Jun 2021 3:50 AM GMT
సెకండ్ వేవ్ గురించి వారి అంచనాలు నిజమే .. ఇక ముందు కూడా ?
X
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ గురించి దేశ ప‌రిశోధ‌కులు వేస్తున్న అంచ‌నాలు చాలా వ‌ర‌కూ నిజం అయ్యాయి , ప్రస్తుతం కొన్ని జరుగుతున్నాయి. నిజానికి సెకండ్ వేవ్ విష‌యంలో కూడా కొంద‌రు ప‌రిశోధ‌కులు ప్రభుత్వాన్ని హెచ్చ‌రించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ స‌మ‌యానికి చాలా వ‌ర‌కూ కేసులు త‌గ్గిపోయినా, తిరిగి ఫిబ్ర‌వ‌రి నుంచి సెకెండ్ వేవ్ లో క‌రోనా వ‌స్తుంద‌ని కొంద‌రు నిపుణులు చెప్పారు. అయితే, ఆ విషయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎదో దేశం మొత్తం సముద్రంలో మునిగిపోయినట్టు ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలని యుద్ధ ప్రాతిపాదికన నిర్వ‌హించారు. స్వ‌యంగా ప్ర‌ధాని, కేంద్ర హోం మంత్రి.. తాము ప్ర‌తిష్ట‌గా తీసుకున్న రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో క్షణం తీరిక లేకుండా గడిపారు. ఆ లోపే క‌రోనా దేశంలో చాపకింద నీరులా వ్యాప్తి చెందింది. సెకెండ్ వేవ్ నియంత్రించ‌లేనంత స్థితికి చేరింది. సెకండ్ వేవ్ లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఆర్థిక నష్టం కూడా జరిగింది. అయితే , ఈ సెకండ్ వేవ్ కొంచెం తగ్గుముఖం పట్టగానే , ఎదో సెకండ్ వేవ్ ను జయించినట్టు కేంద్రం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ, ఇంకా సెకండ్ వేవ్ విజృంభణ జరుగుతుంది.

సెకెండ్ వేవ్ వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో ప‌లువురు వైరాల‌జిస్టులు, వ్యాక్సినోల‌జిస్టులు వేసిన అంచ‌నాలు దాదాపు నిజం అవుతున్నాయి. సెకెండ్ వేవ్ మే నెల ద్వితీయార్థం నుంచి త‌గ్గుముఖం ప‌ట్ట‌వ‌చ్చ‌ని ప‌లువురు వైరాల‌జిస్టులు, అధ్య‌య‌న సంస్థ‌లు అంచ‌నా వేశాయి. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య రోజుకు ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కూ చేరొచ్చ‌ని కొన్ని అధ్య‌య‌న సంస్థ‌లు అంచ‌నా వేశాయి, ఆ త‌ర్వాత క‌రోనా తగ్గుముఖం ప‌డుతుంద‌ని కూడా అవి చెప్పాయి. ప్ర‌భుత్వ అధికారిక గ‌ణాంకాల ప్ర‌కార‌మే దేశంలో రోజుకు నాలుగు ల‌క్ష‌లకి పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఆ స‌మ‌యంలో అన‌ధికారికంగా రోజుకు ఈజీగా మ‌రో ల‌క్ష కేసుల‌పైనే న‌మోద‌యి ఉంటాయ‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ త‌ర్వాత నెమ్మ‌ది నెమ్మ‌దిగా క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే నెల రోజుల్లోనే రోజుల వ్య‌వ‌ధిలోనే యాక్టివ్ కేసుల సంఖ్య స‌గానికి స‌గం త‌గ్గిపోయింది. ఇప్పుడు దేశంలో క‌రోనా రోజువారీ కేసుల సంఖ్య ల‌క్షకి దిగువగా న‌మోద‌వుతున్నాయి. వ‌ర‌స‌గా మూడో రోజు ల‌క్ష‌లోపే క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇదే త‌గ్గుద‌ల కొన‌సాగుతుంద‌ని ప‌రిశోధ‌కులు ఇది వ‌ర‌కే అంచ‌నా వేశారు. జూన్ నెలాఖ‌రుకు రోజువారీ కేసుల సంఖ్య రెండు వేల స్థాయికి త‌గ్గుతుంద‌నే అంచ‌నాలు, అభిప్రాయాలు ఇది వ‌ర‌కే వినిపించాయి. బ‌హుశా ఆ అంచ‌నాలే నిజం అయ్యే అవ‌కాశాలు కూడా కనిపిస్తున్నాయిప్పుడు. సెకెండ్ వేవ్ గురించి ప్రిడిక్ట్ చేసిన వారి అంచ‌నాల‌ను ఇక ముందు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.