Begin typing your search above and press return to search.

వాళ్ల ఆవేద‌న న‌న్ను చంపేస్తోందిః అశ్విన్‌

By:  Tupaki Desk   |   6 May 2021 2:30 AM GMT
వాళ్ల ఆవేద‌న న‌న్ను చంపేస్తోందిః అశ్విన్‌
X
దేశంలో క‌రోనా క‌ల్లోలం రోగుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుంటే.. వారి ప‌రిస్థితిని చూసిన వారిని మ‌నోవేద‌న‌కు గురిచేస్తోంది. తాజాగా.. క్రికెట‌ర్ ర‌వి చంద్ర‌న్ అశ్విన్ కూడా స్పందించారు. బాధితుల ప‌రిస్థితి క‌న్నీళ్లు పెట్టిస్తుంటే.. వారిని కాపాడలేక‌ వైద్యుల ముఖాల్లో నెల‌కొన్న‌ నిస్స‌హాయ‌త త‌న‌ను చంపేస్తోంద‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

కొవిడ్ బారిన ప‌డిన వారి ప‌రిస్థితి ఏంటో అశ్విన్ కు బాగా తెలుసు. ఎందుకంటే.. అత‌ని కుటుంబ స‌భ్యులకు సైతం క‌రోనా సోకింది. చివ‌ర‌కు త‌న పిల్ల‌లను సైతం ఈ మ‌హ‌మ్మారి వ‌దిలిపెట్ట‌లేదు. ఈ కార‌ణంగానే.. అత‌ను అర్థంత‌రంగా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.

అయితే.. అశ్విన్‌ కుటుంబ స‌భ్యులు అంద‌రూ వైర‌స్ నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో.. వైర‌స్ కార‌ణంగా త‌మ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, తీసుకున్న చ‌ర్య‌ల‌ను అంద‌రికీ వివ‌రిస్తున్నారు అశ్విన్‌. త‌న అనుభ‌వాల ద్వారా జ‌నాల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కాగా.. ఇటీవ‌ల ఢిల్లీలో ఆక్సీజ‌న్ అంద‌క ఒక వైద్యుడితోపాటు 12 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యమై ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. బాత్రా ఆసుప‌త్రి డైరెక్ట‌ర్ గుప్తా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఇది చూసిన తాను నిలువునా చ‌నిపోయాన‌ని అశ్విన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రోగుల‌ను కాపాడ‌లేక వైద్యులు ప‌డుతున్న ఆవేద‌న తీవ్రంగా క‌ల‌చివేస్తోంద‌ని చెప్పారు. దేశ‌వ్యాప్తంగా ఆక్సీజ‌న్ దొర‌క్క ఎంతో మంది చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు వైద్యులు కూడా ఈ ప‌రిస్థితిని ఎదుర్కొని ప్రాణాలు కోల్పోతుండ‌డం విషాదం.