Begin typing your search above and press return to search.

ఒపెక్ దేశాల 'ఉత్పత్తి'కత్తి.. మళ్లీ చమురు గుబులు.. జేబుకు చిల్లు

By:  Tupaki Desk   |   6 Oct 2022 4:30 PM GMT
ఒపెక్ దేశాల ఉత్పత్తికత్తి.. మళ్లీ చమురు గుబులు.. జేబుకు చిల్లు
X
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్ ధరల విషయంలో మూడు నెలల నుంచి సామాన్యుడు దిలాసాగా ఉంటున్నాడు. అయ్య బాబోయ్ పెట్రోల్ ధర అనుకోవడం మానేశాడు.జేబుల్లో కాస్తయినా డబ్బు మిగిలిందని సంతోషిస్తున్నాడు. కానీ, ఇదంతా తాత్కాలికమేనా..? ఇంతక్రితంలా మళ్లీ పెట్రో ధరల మంట తప్పదా..? పెట్రోల్ ఉత్పత్తి దేశాల వైఖరి చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. చమురు ధరల పెంపునకు ఒపెక్ తో పాటు అనుబంధ దేశాలు ప్రయత్నాలు సాగిస్తుండడమే దీనికి నిదర్శనం.

ఉత్పత్తి తగ్గింది.. ధర మోతెక్కనుంది?డిమాండ్.. సరఫరా.. ముడి చమురు ధరను ప్రభావితం చేసే రెండు అంశాలు. అయితే, మూడు నెలలుగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ధరల పెరుగుదల తదితర కారణాలతో ముడి చమురుకు డిమాండ్ తగ్గింది. ఈ ప్రభావంతో ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్ల నుంచి 90 డాలర్లకు పడిపోయింది. ఇది అసలుకే మోసంలా ఉందని ఒపెక్, అనుబంధ దేశాలు భావించాయి. దీంతో తమ చేతుల్లో పని అయిన ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి.వాస్తవానికి మహమ్మారి కరోనా వ్యాప్తి తగ్గుదల అనంతరం పరిస్థితులు మారుతున్నాయి. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్ డిమాండ్ తీర్చేందుకు ఒపెక్, అనుబంధ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో చమురు ధరలను పెంచేందుకు తద్వారా అదనపు ఆదాయన్ని పొందాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి.

రోజుకు 20 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి తగ్గింపు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్, అనుబంధ దేశాలు నిర్ణయించాయి.

అయితే, దీనిపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని హెచ్చరించింది. అయినా.. ఒపెక్, అనుబంధ దేశాల కూటమి వెనక్కి తగ్గలేదు. దీంతో ఇంధన ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం వచ్చింది. ముడిచమురు ధరల ప్రభావం సహజంగానే నిత్యావసరాల ధరలపై పడుతుంది. దాంతో వాటి ధరలు మరింతగా పెరుగుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరకు.. ప్రపంచ దేశాలు మళ్లీ వడ్డీ రేట్ల పెంపును ప్రకటిస్తాయని చెబుతున్నారు. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగించి కుప్పకూలే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌ లోనూ ధరల పెరుగుదల ఒపెక్, అనుబంధ దేశాలు ముడి చమురు ఉత్పత్తిని తగ్గిస్తే ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అన్ని దేశాలు తమ నిల్వల నుంచి అదనపు ముడి చమురును బయటకు తీస్తాయి. ధరల పెరుగుదలను మాత్ర అవి నియంత్రించలేవు. భారత ప్రభుత్వం కూడా ధరలు తగ్గించే అవకాశం లేదు. ఒపెక్, అనుబంధ దేశాల కోత కారణంగా భారత్ కొనుగోలు చేసే ముడి చమురు ధర పెరిగితే.. పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో మన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చని తెలుస్తోంది.కాగా, చాలా దేశాలు తమ సామర్థ్యం కంటే తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తున్నాయని.. అందుకే ఒపెక్, అనుబంధ దేశాల నిర్ణయం ప్రభావం అంతగా ఉండదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయం భారత్‌కు అత్యంత కీలకం. భారత్ తన ముడి చమురులో 70 శాతం ఒపెక్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది.

గల్ఫ్ దేశాలను బుజ్జగిస్తున్నఅమెరికా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించనున్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్న అమెరికా గల్ఫ్ దేశాలను బుజ్జగించే పనిలో పడింది. ఉత్పత్తి తగ్గింపు నిర్ణయం నుంచి వైదొలగాలని కోరుతోంది. మరోవైపు నవంబరులో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇంధన ధరలను ఎలాగైనా అదుపులో ఉంచాలని అధ్యక్షుడు జో బిడెన్ ప్రయత్నిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ వార్తా నివేదిక ప్రకారం.. పెట్రోల్-డీజిల్ ఇతర శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం విధించడం వల్ల దేశంలో ధరలను అదుపులో ఉంచుతామో లేదో తెలుసుకోవడానికి అమెరికా వైట్ హౌస్ అధికారులు ఇంధన శాఖను కోరారు. ఈ ఆలోచనకు బిడెన్ పరిపాలనలోని కొంతమంది నుంచి కూడా మద్దతు లభిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.