Begin typing your search above and press return to search.

రాష్ట్రం విడిపోతే.. రిజర్వేష‌న్లు వ‌ర్తిస్తాయా? సుప్రీం కోర్టు విస్మ‌యం.. ఏం జ‌రిగిందంటే

By:  Tupaki Desk   |   21 July 2021 11:30 AM GMT
రాష్ట్రం విడిపోతే.. రిజర్వేష‌న్లు వ‌ర్తిస్తాయా? సుప్రీం కోర్టు విస్మ‌యం.. ఏం జ‌రిగిందంటే
X
ఇటీవ‌ల కాలంలో సుప్రీం కోర్టు ముందు.. చిత్ర విచిత్ర‌మైన కేసులు వ‌స్తున్నాయి. ఎక్క‌డాలేని సందేహాలు, ప్ర‌శ్న‌ల‌తో కూడిన‌.. పిటిష‌న్లు కోర్టుల ముందు దాఖ‌ల‌వుతున్నాయి. అలాంటి వాటిలో తాజాగా సుప్రీంకోర్టులో దాఖ‌లైన కేసుపై ధ‌ర్మాస‌నం.. విస్మ‌యం చేసింది. దీనిపై లోతుగా స‌మీక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. విచార‌ణ చేయాల్సిన అస‌వ‌రం ఉంద‌ని.. సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మ‌రి ఇంత‌కీ ఆ కేసు విష‌యం ఏంటంటే..`` షెడ్యూల్డ్‌ తరగతి(ఎస్సీ)కి చెందిన వ్యక్తి ఒక రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ పొందుతుండగా, ఆ రాష్ట్రం రెండుగా విడిపోతే.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రిజర్వేషన్‌ కోరే హక్కు అతనికి ఉంటుందా? ఉండదా?`` అనే!

దీనిని ప్ర‌శ్నిస్తూ.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. తొలుత ఈ పిటిష‌న్‌పై న్యాయ‌మూర్తులు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. ఇది అసాధారణ, వింతైన ప్రశ్న అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దీన్ని తాము లోతుగా, క్షుణ్నంగా పరిశీలిస్తు న్నామని పేర్కొన్నారు. ఇలాంటి ప్రశ్న తమ వద్ద తలెత్తడం ఇదే మొదటిసారి అని తెలిపింది. సాధ్యాసాధ్యాలను తేల్చేయడానికి ఇప్పటిదాకా దీనికి సంబంధించిన చట్టాలు లేవని గుర్తుచేసింది. ఈ విషయంలో తమకు సహకరించాలని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌కు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ధర్మాసనం విజ్ఞప్తి చేసింది.

అయితే, రాష్ట్రం విడిపోయినంత మాత్రాన రిజర్వేషన్లు మారవని కె.కె.వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని, రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన రిజ‌ర్వేష‌న్ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌బోద‌ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన పంకజ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. దీనిపై జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది.

ఈ పిటిష‌న్ రిజర్వేషన్లపై కొత్త ప్రశ్నను తెర‌మీదికి తెచ్చింద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. బిహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో పంకజ్‌కు ఎస్సీ రిజర్వేషన్‌ సౌకర్యం లభించదని జార్ఖండ్‌ హైకోర్టు 2020 ఫిబ్రవరి 24న తీర్పునిచ్చింది. స్టేట్‌ సివిల్‌ సర్వీసు పరీక్ష రాయడానికి అతడు అర్హుడు కాదని పేర్కొంది. దీన్ని సవాలు చేస్తూ పంకజ్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తొలుత విస్మ‌యం వ్య‌క్తం చేసిన‌.. సుప్రీం ధ‌ర్మాసనం.. మొత్తానికి ఈ కేసును విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలని అంటున్నారు న్యాయ నిపుణులు.