Begin typing your search above and press return to search.

దేశ చరిత్రలో తొలిసారి.. మోడీ సర్కారు అలా చేస్తుందట

By:  Tupaki Desk   |   24 Nov 2021 5:04 AM GMT
దేశ చరిత్రలో తొలిసారి.. మోడీ సర్కారు అలా చేస్తుందట
X
సంచలన నిర్ణయాన్ని తీసుకుంది మోడీ సర్కారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు మరే ప్రభుత్వం తీసుకోని రీతిలో ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కొద్ది నెలలుగా అంతర్జాతీయ విపణిలోమండుతున్న ముడిచమురు ధరలకు చెక్ పెట్టటానికి.. దేశీయంగా చమురుధరలు పెరగకుండా ఉండేందుకు వీలుగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రిజర్వు కోసం దాచి ఉంచే ముడిచమురును భారీ స్థాయిలో బయటకు తీసి వాడేందుకు ప్లాన్ సిద్దం చేసింది.

ఇందులో భాగంగా అత్యవసర వినియోగానికి వాడేందుకు పక్కన పెట్టిన ముడి చమురు నిల్వల్లో 5 మిలియన్ బ్యారళ్లను వాడేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన వేళ.. అమెరికా.. చైనా.. జపాన్ లాంటి దేశాలు తాజాగా మోడీ సర్కారు అనుసరించిన విధానాన్ని అనుసరిస్తుంటారు. అయితే.. ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయానికి సాహసించలేదు. అందుకు భిన్నంగా మోడీ సర్కారు అడుగు ముందుకు వేసింది.

దేశీయంగా ఏపీలోని విశాఖపట్నంలో 1.33 మిలియన్ టన్నులు.. కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నులు.. పాడూర్ లో 2.5 మిలియన్ టన్నుల చొప్పున చమురు స్టోరేజీలు ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా రోజుకు 4.8 మిలియన్ బ్యారళ్ల చమురును వినియోగిస్తున్న పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోతున్న వేళ.. వాటిని తగ్గించేందుకు పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (ఒపెక్)ను అమెరికా కోరింది.

ఇందుకు ఒపెక్ తో పాటు.. చమురు ఉత్పత్తి చేసే దేశాలు నో చెప్పిన వేళ.. ధరల్ని తగ్గించేందుకు అమెరికా కొత్త వ్యూహాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా చమురును అత్యధికంగా వినియోగించే అమెరికా.. చైనా.. ఇండియా.. జపాన్ దేశాలు కలిసికట్టుగా తమ నిల్వలను ఉపయోగించాలని.. ధరలు తగ్గించేందుకు ముందుకు వచ్చాకే కొనుగోళ్లు చేపట్టాలన్న వ్యూహాన్ని తెర మీదకు తీసుకొచ్చింది.

ఇందుకు తగ్గట్లే చైనా.. భారత్.. జపాన్.. అమెరికాలు ఆ విధానాన్ని పాటించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా రిజర్వుగా ఉంచి నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల విడుదలకు భారత్ సైతం ఓకే చేసింది. చమురు వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో పెద్ద దేశంగా ఉంది. అమెరికా 72.7 కోట్ల బ్యారళ్ల చమురును నిల్వ చేయగా.. జపాన్ 17.5 కోట్ల బ్యారళ్ల చమురును రిజర్వులో ఉంచుతోంది.

ప్రపంచంలో చమురును అత్యధికంగా వినియోగించే దేశాలైన యూఎస్.. చైనా.. భారత్ తదితర దేశాలు చేతులు కలిపిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అత్యవసర నిల్వల నుంచి చమురును దేశీయ అవసరాల కోసం విడుదల చేసిన నేపధ్యంలో ఒపెన్ దేశాలకు ఆర్డర్లు లేని పరిస్థితి వస్తుంది. దీంతో.. వారు దిగి రాక తప్పదన్న మాట వినిపిస్తోంది.