Begin typing your search above and press return to search.

టీకా నియంత్రణ కేంద్రం చేతుల్లోనే ... ప్రజలకి వాస్తవాలు చెప్పండి !

By:  Tupaki Desk   |   11 May 2021 8:30 AM GMT
టీకా నియంత్రణ కేంద్రం చేతుల్లోనే ... ప్రజలకి వాస్తవాలు చెప్పండి !
X
ఏపీలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. రోజురోజుకి కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేస్తున్నా కూడా కరోనా అదుపులోకి రావడం లేదు. అయితే , ఇదిలా ఉంటే ఏపీలో వ్యాక్సినేషన్ పై పెద్ద రచ్చ జరుగుతుంది. ప్రభుత్వం , విపక్షం మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్‌ కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు స్పష్టంగా చెప్పాలని సీఎం జగన్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్‌ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలన్నా ఎన్ని విక్రయించాలనేది కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తోందని తెలిపారు.

ఆలాగే , దేశంలోని ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్నీ కేంద్రమే నిర్ణయిస్తోందని, ఆ కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అది కూడా డబ్బులు ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుందని , వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని, ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసినప్పటికీ , కూడా రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా కలసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుద్దేశ పూర్వకంగా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని, కావాలనే ప్రజల్లో ఆందోళన, భయాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సీఎం జగన్‌ సోమవారం కరోనా స్పెషల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ఫోర్స్‌ బృందంతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అందరికీ వ్యాక్సిన్‌ అందుతుందని, ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుందని, కాకపోతే అందుకు కొంత సమయం పడుతుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని అన్నారు.

వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట పరిస్థితులు కనిపించకూడదని , వ్యాక్సిన్‌ ఎవరికి వేస్తారన్న దానిపై వలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ ఎంలు ముందుగానే ప్రజలకు స్పష్టంగా చెప్పాలని తెలిపారు. అలాగే వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద కుర్చీలు ఏర్పాటు చేసి టీకా తీసుకునే వారికి సౌకర్యంగా ఉండేలా చూడాలని తెలిపారు. 45 ఏళ్లకు పైబడి, మొదటి డోస్‌ తీసుకుని రెండో డోస్‌కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్‌ అందించేలా చూడాలని అన్నారు. నెలకు కోటి వ్యాక్సిన్లు సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కనీసం 6 నెలలు పడుతుంది. ప్రస్తుతం సగటున నెలకు 19 లక్షలకు పైగా డోసులు మాత్రమే వస్తున్నాయి. వ్యాక్సిన్ల కొనుగోళ్లపై గ్లోబల్‌ టెండర్లకు వెళ్లేందుకు అనుమతి కోసం అధికారులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ఆదేశించారు.

ఇప్పటివరకు రాష్ట్రానికి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ మొత్తం 60,60,400 డోసులు రాగా తొలి డోస్‌ కింద 43,99,802, రెండో డోస్‌ కింద 16,87,315 ఇచ్చామని, టీకాలు వృథా కాకుండా నైపుణ్యంతో వినియోగించడం ద్వారా మొత్తం 60,87,117 డోస్‌లు ఇచ్చాం. కోవాక్సిన్‌ మొత్తం 12,89,560 డోసులు రాగా తొలి డోస్‌ కింద 9,23,296 వాక్సీన్లు, రెండో డోస్‌ కింద 2,90,047 వ్యాక్సీన్లు కలిపి మొత్తం 12,13,343 కోవాక్సిన్‌ డోస్‌ లు ఇచ్చామని అన్నారు. కోవిషీల్డ్, కోవాక్సిన్‌ రెండూ కలిపి మొత్తం ఇప్పటివరకు 73,49,960 డోసులు రాగా తొలి డోస్‌ కింద 53,23,098 వ్యాక్సిన్లు, రెండో డోస్‌ కింద 19,77,362 వ్యాక్సిన్లు కలిపి ఇప్పటి వరకు మొత్తం 73,00,460 డోసులు ప్రజలకి ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మే నెలలో తొలి 15 రోజులకు సంబంధించి కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌ రెండూ కలిపి 9,17,850 డోస్‌లు ఇస్తామన్న కేంద్రం ఇప్పటి వరకు 7,65,360 డోస్‌లు ఇచ్చింది. ఇంకా 1,52,490 డోస్‌లు రావాల్సి ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కింద కేంద్రం నిర్ణయించిన ప్రకారం 16,85,630 డోసులు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు 4,93,930 మాత్రమే ఇచ్చారు. ఇంకా 11,91,700 రావాల్సి ఉంది. భారత్‌ బయోటెక్‌ నుంచి 3,43,930 డోస్‌లు కేటాయించామని.. డబ్బులు చెల్లించి వాటిని కొనుక్కోవాలని ఏప్రిల్‌ 29న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది.