Begin typing your search above and press return to search.

అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభం.. ఒప్పుకోని ట్రంప్

By:  Tupaki Desk   |   22 Nov 2020 11:51 AM GMT
అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభం.. ఒప్పుకోని ట్రంప్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ ఆ పదవిని వీడకుండా కోర్టులకు ఎక్కుతూ అధికార బదిలీ ప్రక్రియను ఆలస్యం చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఎన్నికల్లో జోబైడెన్ గెలిచినా ఓటమిని ట్రంప్ అంగీకరించడం లేదు. రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఓటమితో అధికార బదిలీ జరుగాల్సి ఉండగా ట్రంప్ పంతం కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్వేత సౌధం అధికారులు మాత్రం అధికార బదిలీ కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. తాజాగా శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ క్యాలీ మెక్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ వాదనను సమర్థించారు.చట్టబద్ధమైన ప్రతీ ఓటును లెక్కించాలని ట్రంప్ కోరడం కరెక్టేనని చెప్పారు.

ఓటమిని డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు అంగీకరిస్తాననేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే అధ్యక్ష మార్పిడి చట్టం ప్రకారం పాటించాల్సిన అన్ని పనులను చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అధికార మార్పిడి చేయాల్సిన జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బైడెన్ విజయం సాధించినట్లు పత్రాలు అందకపోవడంతో అధికారులు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.మరోవైపు బైడెన్ మాత్రం మంత్రి వర్గ కూర్పుపై ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే 15మందితో నూతన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇక డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనపై దుష్ప్రచారం చేసి ఓడించేందుకు ఔషధ కంపెనీలు కోట్ల రూపాయాలు ఖర్చు చేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఔషధ కంపెనీలు ఖండిస్తున్నాయి. ఈ తరుణంలో అధ్యక్ష మార్పిడికి ఇంకా కొంత సమయం పట్టేలా కన్పిస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. నవంబర్లో ఎన్నికల ఫలితాలు రాగా ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ట్రంప్ 232 ఎలక్ట్రోరల్ ఓట్లు రాగా డెమెక్రాటిక్ అభ్యర్థి బిడైన్ కు 306 ఓట్లు వచ్చాయి. అయితే ట్రంప్ మాత్రం అమెరికాలో అధికార మార్పిడికి ఒప్పుకోవడం లేదు. దీంతో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.