Begin typing your search above and press return to search.

లీటరు పెట్రోల్ రూ.75కు తగ్గించే ఛాన్సు మోడీ సర్కారు చేతుల్లో ఉంది

By:  Tupaki Desk   |   5 March 2021 4:46 AM GMT
లీటరు పెట్రోల్ రూ.75కు తగ్గించే ఛాన్సు మోడీ సర్కారు చేతుల్లో ఉంది
X
అందరూ అనుకుంటున్నట్లుగా లీటరు పెట్రోలో రూ.వందకు వెళ్లటం పెద్ద విషయం కాదు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానమే కొనసాగిస్తే.. రానున్న రోజుల్లో లీటరు పెట్రోల్ ఎంతవరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర మండిపోతే.. ఏ ప్రభుత్వం చేసేదేమీ లేదు. అందుకు భిన్నంగా పన్నుల మీద యావతో.. ప్రజల్ని కష్టపడేలా చేస్తున్న పెట్రోల్ ధర పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరికి పెట్రోల్ ధర పెంపు.. దాన్ని మారు మాట్లాడకుండా అంగీకరించటం దేశభక్తితో సమానమన్న అర్థం లేని మాటలు చెబుతున్నారు.

ఇలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ లెక్కన చూస్తే.. పన్నులు వేసే ప్రభుత్వాల్ని వ్యతిరేకించటం.. వారి విధానాల్ని తప్పు పట్టే వారికి దేశభక్తి లేదన్న తలతిక్క వాదనను ఇక్కడే.. ఇప్పుడే తుంచేయాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ప్రజాహక్కులు మరిన్ని రానున్న రోజుల్లో దేశభక్తి ముసుగులో ఆవిరి కావటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తుంది. ఇంతకూ పెట్రోల్ ధర మంటను చల్లార్చే మార్గం లేదా? అంటే.. ఉందని చెప్పాలి.

ఎందుకంటే.. ఇవాల్టి రోజున ముడిచమురును శుద్ది చేసి పెట్రోల్.. డీజిల్ గా తయారు చేసే ప్రక్రియకు అయ్యే ఖర్చు కంటే.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతూ వడ్డిస్తున్న పన్ను పుణ్యమా అని ఈ రోజున ఇంతటి ధరలకు కారణమని చెప్పాలి. ప్రస్తుతం పెట్రోల్.. డీజిల్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా పన్నులు విధిస్తున్నాయి. ఇప్పుడు అమలు చేస్తున్న పన్నుల విధానాన్ని మార్చి.. జీఎస్టీలోకి తీసుకొస్తే పెట్రోల్.. డీజిల్ ధరలు అనూహ్యగా తగ్గటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

పెట్రోల్.. డీజిల్ మీద వ్యాట్ విధానంలో పన్నును వేయటమే ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పాలి. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా అన్ని వస్తువుల పైనా జీఎస్టీ విధిస్తున్నారు. పెట్రోల్.. మద్యం ఈ రెండింటిని మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాకుండా.. వ్యాట్ లోనే ఉంచేశారు. పెట్రోల్.. డీజిల్ ను ఎప్పుడైతే వ్యాట్ నుంచి జీఎస్టీకి బదిలీ చేస్తారో.. వెను వెంటనే లీటరు పెట్రోల్ రూ.75.. డీజిల్ రూ.68గా మారిపోతుంది. ఎందుకంటే.. జీఎస్టీ గరిష్ఠంగా 28 శాతానికే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ పన్ను విధించే అవకాశం లేదు.

అయితే.. పెట్రోల్.. డీజిల్ పై విధించే పన్నుల్ని జీఎస్టీలోకి తీసుకొస్తే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపుగా రూ.లక్ష కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్ రూ.60 డాలర్లు ఉండగా.. కరెన్సీ మారకం విలువ ఒక డాలరు విలువ రూ.73గా ఉంటుందని లెక్క వేశారు. రవాణా ఛార్జీలు లీటరు పెట్రోల్ కు రూ.3.82.. డీజిల్ కు రూ.7.25 చొప్పున డీలరుకమిషన్ ను లీటరు పెట్రోల్ కు రూ.3.67.. డీజిల్ కు రూ.2.53 చొప్పున లెక్క వేశారు. సెస్ కింద పెట్రలో కు రూ.30చొప్పు.. డీజిల్ కు రూ.20 చొప్పున వేశారు.

వీటితో పాటు.. జీఎస్టీ 28 శాతం చొప్పున విధిస్తూ లెక్కేశారు. ఇంతలా కలిపిన తర్వాతే లీటరు పెట్రోల్ రూ.75.. లీటరు డీజిల్ రూ.68గా తేల్చారు. ముడిచమురు ధర బ్యారెల్ కు ఒక డాలర్ చొప్పున పెరిగితే.. డీజిల్ మీద లీటరుకు యాభై పైసలు.. పెట్రోల్ మీద రూ.1.5 పెరుగుతుందని అంచనా వేశారు. మరి.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీదనే అంతా ఆధారపడి ఉంది. చూస్తూ.. చూస్తూ లక్ష కోట్ల రూపాయిల ఆదాయాన్ని కేంద్రం విడిచేందుకు ఇష్టపడుతుందా? అన్నదే పెద్ద ప్రశ్న.