Begin typing your search above and press return to search.

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఓకే.. ఎలానంటే?

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:56 AM GMT
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఓకే.. ఎలానంటే?
X
మేధావులనే బిరుదుల్ని తమ పేర్లకు ముందు తగిలించుకొని దేశంలో తిరిగే కొందరి కారణంగా చోటు చేసుకునే అనవసర రచ్చకు ప్రతిరూపంగా పౌరసత్వ బిల్లును చెప్పాలి. వివాదాన్ని వెతికి మరీ భుజాన వేసుకొని తిరిగే బ్యాచ్ ఒకటి దేశంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. బ్యాడ్ లక్ ఏమంటే.. ఈ దేశంలో దాని గొంతు పెద్దది. మీడియాలోనూ దానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే.. మేధావి వర్గానికి చెందినోళ్లే అక్కడా ఉంటారు మరి.

ఎక్కడైనా.. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని సమానంగా చూడటం సహజ న్యాయం. కానీ.. దేశంలోని మెజార్టీలు.. మైనార్టీల విషయాల మీద మాట్లాడాల్సి వస్తే మాత్రం.. సమాన న్యాయసూత్రాలు అస్సలు వర్తించవని.. మెజార్టీల కంటే మైనార్టీల వైపే తాము తలొగ్గుతామని వాదిస్తారు. ఇలాంటి వాదనలకు పెద్దపీట వేయటం.. వారికే చెల్లుతుంది. సమాజంలోని ప్రజలంతా తమ పిల్లలుగా ఫీలయ్యే ఇలాంటి తల్లిదండ్రులనే మేధావులే ఈ దేశానికి అసలుసిసలు దరిద్రంగా చెప్పక తప్పదు.

ఒకదేశంలో తప్పు చేస్తే మెజార్టీ.. మెనార్టీ అన్న తేడా లేకుండా మాట్లాడాలి. ఎదవ పని చేసినోడు అగ్రవర్ణమైతే బలుపుగా.. అణగారిన వర్గానికి చెందిన వాడైతే.. పెరిగిన పరిస్థితులంటూ సన్నాయి నొక్కులే ఈ దేశానికి శనిగా పరిగణించాయని చెప్పక తప్పదు. తప్పు ఎవడు చేసినా శిక్ష ఒకేలా ఉండాలన్న మాటను చెప్పారు. అణగారిన వర్గాలకు చెందిన అంబేడ్కర్ దేశ రాజ్యాంగ నిర్మాత కావటం మన దేశ గొప్పతనం. దాన్ని మరిచిపోవటం మేధావులకు మాత్రమే చెల్లుతుంది. మెజార్టీల అధిపత్యమే ఈ దేశంలో మొదట్నించి ఉండి ఉంటే.. అంబేడ్కర్ కు రాజ్యాంగ నిర్మాత అవకాశం దక్కేదా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పరు.

ఎవరైనా ప్రశ్నిస్తే.. ఇలాంటి ప్రశ్నలు వేసేందుకు వీలుగా అప్పటి వారు ముందస్తు వ్యూహం రచించారంటూ పిడివాదనను వినిపించేందుకు కొందరు రెఢీగా ఉంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. పౌరసత్వ బిల్లుపై కొద్ది రోజులుగా దేశంలో సాగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆ బిల్లు ముందు వివాదాస్పదమన్న ముద్ర వేయటంలో విజయవంతమైన మీడియా.. మేధావివర్గం.. దేశంలో మెజార్టీల జనాభా తగ్గిపోతున్న విషయం మీద ఎందుకు ఆందోళన వ్యక్తం చేయదన్న ప్రశ్నకు సమాధానం చెప్పదు.

పౌరసత్వ బిల్లు భారతీయ ముస్లింలకు ఎందుకు నష్టమన్న ప్రశ్న అస్సలు అర్థం కాదు. ఎందుకంటే.. బంగ్లాదేశ్.. పాక్ లలోని ముస్లిమేతరులు మొత్తం భారతదేశానికి వచ్చినా.. ఈ దేశంలోని మైనార్టీలకు జరిగే నష్టం కించిత్ ఉండదు. మరి.. అలాంటప్పుడు ఎందుకంత బాధో అర్థం కాదు. ఇక.. సుదీర్ఘ చర్చ తర్వాత పౌరసత్వ బిల్లు లోక్ సభలో ఆమోదముద్ర పడింది. ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు.. వ్యతిరేకంగా 80 మంది ఓట్లు వేశారు.

ఈ బిల్లుకు బీజేపీకి మిత్రులైన జేడీయూ.. అన్నాడీఎంకే.. అసోం గణపరిషత్.. శిరోమణి అకాలీదళ్ తో పాటు ఈ మధ్యనే దూరమైన శివసేనతో పాటు.. బీజేడీ.. వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ బిల్లును కాంగ్రెస్ తో సహా తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఎన్‌సీ, ఆర్జేడీ, డీఎంకే, ఎంఐఎం, ఐయూఎంఎల్‌, టీఆర్ఎస్‌ లు వ్యతిరేకంగా ఓట్లు వేశాయి.