Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ట్రస్టు ల్లో గోల్ మాల్ పై కేంద్రం ప్రత్యేక కమిటీ!!

By:  Tupaki Desk   |   9 July 2020 11:30 PM GMT
కాంగ్రెస్ ట్రస్టు ల్లో గోల్ మాల్ పై కేంద్రం ప్రత్యేక కమిటీ!!
X
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు నిర్వహిస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థల్లో నిధుల గోల్ మాల్ పై తేల్చేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వీటిపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ తాజాగా ‘ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ’ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈడీ ప్రత్యేక డైరెక్టర్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు. ఈ బృందం సోనియా గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాందీ మెమోరియల్ ట్రస్ట్ లకు వచ్చే మనీ ల్యాండరింగ్ నిధుల్లో మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), ఆదాయపు పన్ను చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘించినట్టుగా వచ్చిన ఆరోపణలపై విచారించనున్నారు.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు సోనియాగాంధీ చైర్ పర్సన్ గా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, పి. చిదంబరంలు ట్రస్టీలుగా ఉన్నారు.ఇక రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ లకు కూడా సోనియా గాంధీనే చైర్ పర్సన్ గా ఉన్నారు.

యూపీఏ హయాంలో సదురు పౌండేషన్లు, ట్రస్టుల్లో విరాళాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కేంద్రం ఈ ప్రత్యేక కమిటీని వేసింది. 2006-09 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు నిరంతరం విరాళాలు అందాయని ఇటీవల బీజేపీ ఆరోపించింది.

భారత్ -చైనా సరిహద్దు ఘర్షణ అనంతరం పీఎం మోడీ కేర్ కు చైనా నుంచి విరాళాలు అందాయని సోనియా, రాహుల్ గాంధీ విమర్శించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు కూడా అందాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రి రవిశంకర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే చైనాకు మోడీ లొంగిపోయారని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. సైనికుల మృతిపై ఇరుకునపెట్టారు. పరస్పర నిధుల గోల్ మాల్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ కాంగ్రెస్ పౌండేషన్ల విరాళాలపై నిగ్గు తేల్చేందుకు ఈ ప్రత్యేక కమిటీ వేసినట్లు తెలుస్తోంది.