Begin typing your search above and press return to search.

జగనన్న హామీపై అధికారుల ఎత్తులతో సర్కారుకు కొత్త చిక్కులు

By:  Tupaki Desk   |   25 July 2021 11:30 PM GMT
జగనన్న హామీపై అధికారుల ఎత్తులతో సర్కారుకు కొత్త చిక్కులు
X
అధినేతలు హామీలు ఇస్తారు. వాటి అమలు కోసం ప్రయత్నిస్తుంటారు. అధికారుల్ని రోడ్ మ్యాప్ చెప్పమని చెప్పి.. వాటిని వాస్తవరూపం దాల్చేందుకు వీలుగా దిశా నిర్దేశం చేస్తారు. అయితే.. హామీల అమలు విషయంలో ఎదురయ్యే వాస్తవిక సమస్యల్ని సరైన పద్దతిలో పరిష్కరించటంలో జరిగే తప్పులు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తాయి. అధినేతకు వాస్తవాలు చెప్పటంతో భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉన్నా.. అలాంటిదేమీ చేయకుండా చేసే తప్పులు ప్రభుత్వాలకు కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతుంటాయి. జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం షురూ చేసిన ఇళ్ల పథకం సరిగా అమలు కాకపోవటం.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటంలో జరిగిన తప్పులు ఆ ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొచ్చాయి. అపార్ట్ మెంట్లను నిర్మించాలని అనుకున్నా.. ప్రాక్టికల్ గా సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో.. సొంతింటికి స్థలం ఇవ్వటానికి ముందుకొచ్చారు సీఎం జగన్. సొంతిల్లుకు స్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మిస్తామని చెప్పిన భారీ హామీతో పేదవారి ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరిసాయి. సొంతింటి కల సాకారం అవుతుందన్న గంపెడాశను పెట్టుకున్నారు.

సొంతింటి కోసం జగన్ ప్రభుత్వం మూడు ఆప్షన్లను ఇచ్చింది. ఇందులో ఆప్షన్లను చూస్తే..

1. లబ్ధిదారులే ఇల్లుకట్టుకోడానికి ముందుకొస్తే ప్రభుత్వం దశలవారీగా లక్షా 80వేల రూపాయలు ఇస్తుంది. నిర్మాణ సామగ్రి ఇతర అవసరాలన్నిటినీ వారే తీర్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు.

2. ప్రభుత్వం నిర్మాణ సామగ్రి అందించి, కూలీ ఖర్చులు భరిస్తే, లబ్ధిదారులే నిర్మించుకోవడం మరో పద్ధతి.

3. పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే.

ఈ మూడు ఆప్షన్లలో లబ్థిదారులంతా మూడో ఆప్షన్ వైపే మొగ్గు చూపారు. దీని ద్వారా తమపై అదనపు భారం పడకుండా ఉంటుందని ఆశించారు. ఇదే అధికారులకు పెద్ద ఇబ్బందిగా మారింది. జగనన్న కాలనీల్లో నిర్మించేందుకు ఖరారు చేసిన ఇంటి డిజైన్ ను నిర్మించటానికి రూ.3లక్షల వరకు పడుతుందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో.. ఇప్పుడు భారీగా కట్టాల్సిన ఇళ్ల సముదాయాలకు భారీ ఖర్చు అవుతుందన్న లెక్కలు అధికారులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో.. ఇల్లు కట్టించి ఇచ్చే విషయంలో కొత్త ఎత్తు వేసిన అధికారులు.. అందరికి ఇల్లు కట్టి ఇవ్వలేమని.. దివ్యాంగులు.. వితంతువులు.. మరీ నిరుపేదలకు మాత్రమే ఇంటిని కట్టి ఇస్తామని చెబుతున్నారు

తాము చెప్పిన వారు కాకుండా మిగిలిన వారంతా ప్రభుత్వం ఇచ్చే రూ.1.80లక్షల మొత్తాన్ని తీసుకొని సొంతంగా ఇల్లు కట్టుకోవాలని చెబుతున్నారు. దీంతో లబ్థిదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చూస్తూ.. చూస్తూ దాదాపు లక్షన్నర వరకు తమ మీద అదనపు భారం మోపేలా చేయటాన్ని వారు ఇష్టపడటం లేదు. అలా అని ప్రభుత్వమే టేకప్ చేయాలంటే మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 15.60లక్షల ఇళ్లను నిర్మించాల్సి వస్తుంది. ఇందులో పది లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. ఒక్కో ఇంటికి రూ.3లక్షల చొప్పున పది లక్షల ఇళ్లు అంటే బడ్జెట్ ఒక రేంజ్ లో ఉంటుంది.

దీంతో.. అధికారులు మరో ఎత్తు వేశారు. తాము చెప్పిన గడువు లోపు లబ్థిదారులు ఇంటిని నిర్మించుకోకుంటే.. వారికి ఇస్తామన్న ఇల్లు క్యాన్సిల్ అవుతుందన్న ప్రచారాన్నిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి మాటలు లబ్థిదారుల్లో కొత్త గుబులుకు కారణం కావటమే కాదు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేలా చేస్తోంది. జగనన్న ఇంటి పథకాన్ని అమలు చేసే విషయంలోతమకు ఎదురవుతున్నాప్రాక్టికల్ సమస్యల్ని సీఎం జగన్ వరకు వెళ్లకపోవటంతో.. క్షేత్ర స్థాయిలో అంతా బాగా జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు. కానీ.. గ్రౌండ్ లో జరిగే అంశాలు ముఖ్యమంత్రికి తెలిస్తే ఏం చేయాలో తెలుస్తుందని చెబుతున్నారు. అయితే.. అధికారులు మాత్రం మౌనంగా ఉండటం.. ముఖ్యమంత్రి అడిగినప్పుడు కవరింగ్ సమాధానంతో తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ ఇష్యూను ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.