Begin typing your search above and press return to search.

అదే.. అక్బరుద్దీన్ ఆగ్రహానికి కారణం?

By:  Tupaki Desk   |   6 Feb 2023 11:00 PM GMT
అదే.. అక్బరుద్దీన్ ఆగ్రహానికి కారణం?
X
గతంలో ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్న సన్నివేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. తెలంగాణ అధికార పక్షానికి నమ్మకమైన మిత్రపక్షం వ్యవహరించే మజ్లిస్.. ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు కురిపించటం.. దీనికి ప్రతిగా మంత్రి కేటీఆర్ సైతం గట్టిగా బదులివ్వటం తెలిసిందే. నిజానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి కనిపించే సీన్ ఒక్కటే. ఎవరు అధికారపక్షంలో ఉంటే.. వారికి దన్నుగా నిలిచే ధోరణి మజ్లిస్ లో కనిపిస్తూ ఉంటుంది. దీనికి మినహాయింపు ఏమైనా ఉందంటే.. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమేనని చెప్పాలి.

ఆయనతో మినహాయించి దాదాపుగా అధికారపక్షానికి సన్నిహితంగా ఉండే మజ్లిస్.. తెలంగాణ రాష్ట్ర ఆరంభం నుంచి కూడా టీఆర్ఎస్ కు సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. కేసీఆర్ కు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే.. ఆయనతోకలిసి మాట్లాడేందుకు ఏకంగా బుల్లెట్ వేసుకొని మరీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రావటం తెలిసిందే. అంతటి జిగిరీ దోస్తుగా ఉన్న మజ్లిస్ కు అధికారటీఆర్ఎస్ మీద ఆగ్రహం ఎందుకు వచ్చింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

మొదట్నించి ఏడు సీట్లకే పరిమితమయ్యే మజ్లిస్ కు.. వారికున్న సంఖ్యా బలంతో సంబంధం లేకుండా కాసింత ఎక్కువ సమయం మాట్లాడటానికి ఇవ్వటం వస్తున్నదే. కానీ.. మంత్రి కేటీఆర్ మాత్రం ఇదే విషయాన్ని క్వశ్చన్ చేయటమే కాదు.. ఏడుగురే అంటూ కాసింత చిన్నబుచ్చేలా మాట్లాడటం తెలిసిందే. దీనికి ప్రతిగా అక్బరుద్దీన్ స్పందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో తాము 15 మంది ఎమ్మెల్యేలతో సభలోకి వస్తామని చెబుతూనే.. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంటామని చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

ఎప్పుడూ లేనట్లుగా.. మజ్లిస్ నోటి నుంచి ఎమ్మెల్యేల సంఖ్య గురించి ఇంత స్పష్టంగా రావటం.. అది కూడా తమ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో చర్చిస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేయటం తెలిసిందే. ఇంతకాలం పాలునీళ్ల మాదిరి ఉండే.. బీఆర్ఎస్ - మజ్లిస్ ల మధ్య ఈ తేడాలేంటి? ఎందుకిలాంటి పరిస్థితి అన్న సందేహం చాలామందికి వచ్చింది. అయితే.. సమాధానం మాత్రం రాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ ఫజిల్ కు తన మాటలతో 'కీ' తీసేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు.

అక్బరుద్దీన్ మిత్రులకు మంత్రి కేటీఆర్ అపాయింట్ ఇవ్వకుండా ఉన్నారని.. వారు కోరిన పని చేయటం సాధ్యం కాదని కేటీఆర్ అలా చేస్తున్నారన్నారు. దీంతో.. అక్బరుద్దీన్ కు మండిందని.. అందుకే అసెంబ్లీలో అంత ఘాటుగా రియాక్టు అయ్యారని చెప్పుకొచ్చారు. మరి.. ఇందులో వాస్తవం ఎంతన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగామారింది. ఏమైనా బీఆర్ఎస్ - మజ్లిస్ మిత్రబేధం మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.