Begin typing your search above and press return to search.

న్యూజిలాండ్ టూర్ రద్దుకు ఈ సింగర్ కారణమట: పాక్ మంత్రి ఆరోపణ

By:  Tupaki Desk   |   25 Sep 2021 2:30 AM GMT
న్యూజిలాండ్ టూర్ రద్దుకు ఈ సింగర్ కారణమట: పాక్ మంత్రి ఆరోపణ
X
ఎంకీ పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకోవడానికి కారణం భద్రతాలోపాలు.. బాంబు బెదిరింపులన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి ఒకరు కొత్త కారణాలు చెబుతున్నాడు. అవిప్పుడు వైరల్ గా మారాయి.

పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టుపై కాల్పులు జరిగిన దశాబ్ధం తర్వాత న్యూజిలాండ్ దేశం పర్యటనకు వచ్చింది. మరికాసేపట్లో తొలి వన్డే ప్రారంభమవుతుందనగా.. భద్రతాపరమైన కారణాలతో సిరీస్ ను రద్దు చేసుకొని న్యూజిలాండ్ జట్టు ఆదేశం వెళ్లిపోయింది. దీంతో క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్ పరువు పోయింది. ఇది సంచలనమైంది.

ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ క్రికెట్ కు కివీస్ నిర్ణయం శరాఘాతమైంది. అయితే తాజాగా ఈ మొత్తం వ్యవహారం వెనుక భారత్ ఉందంటూ పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి పవాద్ చౌదరి ఆరోపించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

'తెహ్రీక్ ఐ తాలిబాన్ పాకిస్తాన్' అనే ఉగ్రవాద సంస్థ నకిలీ ఖాతా నుంచి కివీస్ జట్టుకు ఈ-మెయిల్ బెదిరింపు వెళ్లినట్లు ఆరోపించారు. ఈ బెదిరింపు వ్యవహారంలో ఓం ప్రకాష్ మిశ్రా అనే వ్యక్తి ఉన్నాడని.. ఇదంతా ఇండియా వేదికగా జరిగిందని ఆరోపించారు. 'బోల్ నా ఆంటీ అవూ క్యా' అనే పాటతో మిశ్రా సోషల్ మీడియాలో సంచలనం అయ్యారు. అతడే న్యూజిలాండ్ టూర్ రద్దుకు కారణం' అని పాకిస్తాన్ మంత్రి చెప్పుకొచ్చాడు.

పాకిస్తాన్ మంత్రి ప్రకటనపై ట్విట్టర్ లో నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీమ్స్ తో ట్విట్టర్ ను హోరెత్తించారు.  దీంతో 'ఓం ప్రకాష్ మిశ్రా' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యింది.

పాకిస్తాన్ మంత్రి పేర్కొన్న ఓం ప్రకాష్ మిశ్రా ముంబైకి చెందిన యూట్యూబర్. ర్యాప్ సాంగ్ 'బోల్ నా ఆంటీ ఆవూ క్యా'తో 2017లో సోషల్ మీడియా సంచలనంగా మారారు. అలాంటి ఓ యూట్యూబ్ స్టార్ ను పట్టుకొని న్యూజిలాండ్ జట్టు పర్యటన రద్దు వెనుక ఉన్నాడని ఆరోపించడం హాస్యాస్పదం అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బోలెడు మీమ్స్ తో పాకిస్తాన్ మంత్రిని ఎండగడుతున్నారు.