Begin typing your search above and press return to search.

మేడ్చల్‌‌ లో దొంగల భీభత్సం ... ఒక్క రాత్రే 6 ఇళ్లల్లో దోచేశారు!

By:  Tupaki Desk   |   13 Jan 2021 12:30 PM GMT
మేడ్చల్‌‌ లో దొంగల భీభత్సం ... ఒక్క రాత్రే 6 ఇళ్లల్లో దోచేశారు!
X
మేడ్చల్‌ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక్క రాత్రే పక్క పక్కనే ఉన్న ఆరు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... మేడ్చల్‌ లోని సూర్యనగర్‌ కాలనీలో సరిత రెసిడెన్సీ అపార్టుమెంట్‌లో ఉంటున్న నారాయణస్వామి తమిళనాడులోని సొంత ఊరుకు రెండు రోజుల కింద వెళ్లాడు. అదే అపార్టుమెంట్ ‌లో ఉంటున్న రాజేశ్‌ మెదక్‌ జిల్లాలోని ముప్పిరెడ్డిపల్లిలో హోటల్‌ నడిపిస్తూ అతడు సోమవారం రాత్రికి ఇంటికి రాలేదు. ఖాళీగా ఉన్న మరో పోర్షన్‌కు తాళం వేసి ఉంది.

రాత్రి 11 గంటలకు వాచ్‌ మన్‌ గేటు వేసి, మంగళవారం తెల్లవారు జామున అపార్టుమెంట్‌ ను శుభ్రం చేయడానికి వెళ్లగా ఇండ్ల తాళాలు పగులగొట్టి ఉన్నవి. వెంటనే అపార్టుమెంట్‌ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తుండగానే అపార్టుమెంట్‌ వెనుకాల ఉన్న మరో రెండు పోర్షన్ల ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆ పక్కన ఉన్న ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. దొంగలు ఇండ్లల్లో వస్తువులను చిందర వందరగా పడవేశారు. మేడ్చల్‌ సీఐ ప్రవీణ్ ‌రెడ్డి, బాధితుల కథనం ప్రకారం.. సూర్యనగర్‌ కాలనీ సరిత రెసిడెన్సీలో మూడు ఇళ్లు, దానికి పక్కవీధిలోని మరో మూడు ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు.

ఈ సందర్భంగా ఓ ఇంట్లో 40 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.10 వేల నగదు, మరో ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. మరో రెండు ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవడంతో చోరీకి గురైన వస్తువుల వివరాలు తెలియరాలేదు. చోరీలపై సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం క్లూస్ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరించారు. సమీప కాలనీల్లోని సీసీ ఫుటేజీల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.