Begin typing your search above and press return to search.

ఒక యాక్సిడెంట్ ..రెండు ప్రమాదాలు .. ఐదుగురు మృతి !

By:  Tupaki Desk   |   5 Dec 2020 4:55 AM GMT
ఒక యాక్సిడెంట్ ..రెండు ప్రమాదాలు .. ఐదుగురు మృతి !
X
ఓ యాక్సిడెంట్ జరిగింది అని చూడటానికి వెళ్తే , ఆ చూడటానికి వెళ్లిన వారిపై నుండి మరో డిసిఎం వెళ్ళింది. ఓ కారు ముందు రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టడం తో అందులోని ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారు. ఆ ప్రమాదాన్ని చూడటానికి వచ్చిన వారిపైకి డీసీఎం వెళ్లడంతో మరో ఇద్దరు మృతి చెందారు. అలాగే , ఓ సీఐ సహా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం సిద్దిపేట శివారులోని రాజీవ్‌ రహదారిపై చోటు చేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... హుజురాబాద్‌ లో నివాసం ఉండే బయ్యారం నరేందర్ ‌రెడ్డి వైద్యసేవల కోసం తన తల్లిదండ్రులతో కలసి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ కు కారులో బయలుదేరారు. సిద్దిపేట శివారులోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న నరేందర్‌రెడ్డి, ఆయన తల్లిదండ్రులు రాజిరెడ్డి, విజయ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీనితో ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సిద్దిపేట టూటౌన్‌ సీఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలిస్తున్నారు. అలాగే.. చుట్టు పక్కల వారు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

ఆ సమయంలో కరీంనగర్‌ నుంచి వేగంగా వస్తున్న డీసీఎం ఓ కారును ఓవర్‌టేక్‌ చేస్తూ.. ప్రమాదాన్ని పరిశీలిస్తున్న గుంపుపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన సిద్దిపేట జిల్లా రామునిపట్ల గ్రామానికి చెందిన అనరాశి మల్లేశం (40), మందపల్లి గ్రామానికి చెందిన వీరన్నపేట ఎల్లారెడ్డిలను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే సిద్దిపేట టూటౌన్‌ సీఐ పరశురామ్‌ గౌడ్, కానిస్టేబుల్‌ అశోక్‌ తో పాటు మరో 13 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ ముందుగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. ఇక ,హైదరాబాద్‌ ఎన్నికల కౌంటింగ్‌ బిజీలో ఉన్న మంత్రి హరీశ్‌రావు ప్రమాదం విషయం తెలుసుకొని మృతుల కుటుంబాలను ఫోన్‌లో ఓదార్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకి ఆదేశాలు జారీచేశారు.