Begin typing your search above and press return to search.

ఆస్పత్రిలో బెడ్ దొరక్క పదిరోజులు అంబులెన్స్ లోనే.. చివరకు!

By:  Tupaki Desk   |   9 May 2021 3:30 PM GMT
ఆస్పత్రిలో బెడ్ దొరక్క పదిరోజులు అంబులెన్స్ లోనే.. చివరకు!
X
కొవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. నాలుగు రోజుల నుంచి రోజూ 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితులతో ఆస్పత్రులు నిండిపోయాయి. పడకలు దొరకక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆక్సిజన్ సమస్యతో ఎంతో మంది అసువులు బాస్తున్నారు. దిల్లీలో కరోనాకు గురైన ఓ వృద్ధుడికి విపరీత అనుభవాలు ఎదురయ్యాయి.

దిల్లీ నివాసి సురీందర్ సింగ్ అనే వ్యక్తికి కరోనా సోకింది. శ్వాస సంబంధ సమస్యలు తీవ్రమై ఆస్పత్రికి ప్రయాణమయ్యారు. రాత్రి 11 గంటల నుంచి బెడ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడా అక్కడ పడకలు ఖాళీ లేవని తిరిగి పంపించారు. బాధితుడిని చూసిన అక్కడి వైద్యులు పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పారు. వెంటనే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్యులను వేడుకున్నా అక్కడ చేర్చుకోలేదు. బాధితుడిని అంతకుముందే షహీన్ బాగ్ లోని ఆల్ షిఫా ఆస్పత్రికి వెళ్తే అక్కడ నిరాశే ఎదురైంది.

ఓ వైపు ఆస్పత్రిలో బెడ్ కోసం వేట మొదలుపెట్టగా బాధితుడు సురీందర్ సింగ్ ఆక్సిజన్ స్థాయి 50కి పడిపోయింది. ఆక్సిజన్ సిలిండర్ సాయం ఉన్నా శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా బాధితుడి పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే వెంటిలేటర్ చికిత్స అవసరమని హెచ్చరించారు. కానీ ఎక్కడా బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా ఉండగానే ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయింది. ఓ వైపు ఆస్పత్రిలో పడక, మరోవైపు సిలిండర్ కోసం బాధితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్రంగా కృషి చేశారు. ఎట్టకేలకు వారికి ఆక్సిజన్ సిలిండర్ లభించింది.

దేశరాజధానిలోని పలు ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. బాధితుడిని అంబులెన్సులోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. పది రోజులు గడిచినా బెడ్ దొరకలేదు. మధ్యలో ఆక్సిజన్ సిలిండర్లు ఖాళీ అవుతున్నాయి. వెంటనే అప్రమత్తమై ప్రాణవాయువును అందించగలుగుతున్నారు. పది రోజుల తర్వాత శుక్రవారం ఓ ఆస్పత్రిలో బెడ్ దొరికింది. అప్పటికి ఆయన ఆక్సిజన్ స్థాయి 70-80 ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు 8 జంబో సిలిండర్లు ఉపయోగించినట్లు సురీందర్ కుటుంబసభ్యులు వెల్లడించారు.

ఆ ఆపద్కాలంలో తమకు ఎందరో సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం విఫలమైందని ఆరోపించారు. ఈ పదిరోజుల శ్రమలో ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల పాటు కరోనా బాధితుడు అంబులెన్సులోనే చికిత్స పొందారు. చివరగా ఓ ఆస్పత్రిలో బెడ్ లభించింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.