Begin typing your search above and press return to search.

మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌: సూర్యాపేట ప‌ట్ట‌ణంలో వీరుడి పేరిట ఓ జంక్ష‌న్‌

By:  Tupaki Desk   |   18 Jun 2020 1:30 PM GMT
మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌: సూర్యాపేట ప‌ట్ట‌ణంలో వీరుడి పేరిట ఓ జంక్ష‌న్‌
X
సరిహద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోశ్‌ బాబు అంత్యక్రియలు తెలంగాణ‌లోని సూర్యాపేటలో క‌న్నీటి మ‌ధ్య కొన‌సాగాయి. హైద‌రాబాద్‌లోని హ‌కీంపేట నుంచి సంతోశ్‌బాబు పార్ధీవ‌దేహాన్ని బుధ‌వారం రాత్రి స్వ‌స్థ‌లం సూర్యాపేట‌కు త‌ర‌లించారు. గురువారం ఉద‌యం సంతోశ్ బాబుకు నివాళుల‌ర్పించిన అనంత‌రం అంతిమ‌యాత్ర ప్రారంభ‌మైంది. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి జగదీశ్‌ రెడ్డి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు పర్యవేక్షించారు. సంతోశ్‌బాబుకు అశ్రునయనాలతో కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు ప్ర‌జ‌లు, ముఖ్యంగా యువ‌త అత‌డి అంతిమ‌యాత్ర‌లో భారీస్థాయిలో పాల్గొంది. అనంతరం కేసారంలో సంతోశ్‌బాబుకు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.

ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం మంత్రి జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమర జవాను కల్నల్ సంతోశ్‌ బాబు జ్ఞాపకంగా కేసారం ప్రాంతాన్ని మార్చుతామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన జంక్ష‌న్‌కు సంతోశ్‌బాబు పేరు పెడతామని ప్రకటించారు. కల్నల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. సంతోశ్‌బాబు పిల్లలు, వారి చదువులు, కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.